మొయినాబాద్లోని ఫామ్హౌస్లో వెలుగులో చూసిన జంట హత్యల కేసులో భయానక నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్పు ఇచ్చిన వారిని వరుసగా మట్టు పెట్టేందుకు ఓ మహిళతో కలిసి మరో ఇద్దరు వ్యక్తులు కుట్ర చేశారని, అందులో ఇప్పటికే ఇద్దరిని హత్య చేశారనే పచ్చి నిజం బయటపడింది. వికారాబాద్ జిల్లా యాలాల, బషీరాబాద్ మండలాలకు చెందిన మహబూబాబీ, అబేదా బేగంలను కరీమాబేగం ఆమెతో సహ జీవనం చేస్తున్న రెహమాన్, మరో వ్యక్తి నయీంలు పథకం ప్రకారం హత్య చేసి వారి మృతదేహాలను మొయినాబాద్లోని ఒక ఫామ్ హౌస్లో పాతిపెట్టిన విషయం తెలిసిందే.
సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ) : పోలీసులు రెండు రోజుల క్రితం ఈ మృతదేహాలను బయటకు తీసి, నిందితులను విచారిస్తున్నారు. అయితే కరీమా బేగం స్థానికంగా ఉండే పలువురి మహిళల నుంచి అప్పులు తీసుకుంది. ఒకరి దగ్గర తీసుకొని మరొకరికి ఇస్తానంటూ చెబుతూ అప్పులతోనే కాలం గడుపుతూ వ్యసనాలకు బానిసైంది. రెహమాన్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నది. వీరికి బంధువైన నయీం మొయినాబాద్లోని ఓ వెంచర్లో పనిచేస్తున్నాడు. వెయ్యి గజాలలో అక్కడ చిన్న చిన్న ఫామ్ హౌస్లు ఏర్పాటు చేసుకొని, ఆయా యజమానులు మొక్కలు పెంచుతున్నారు.
నయీం ఒక ఫామ్ హౌస్లో పనిచేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం ఇక్కడ కరీమాబేగం కూడా పనిచేసి వెళ్లింది. అయితే అప్పు ఇచ్చిన వారు తిరిగి ఇవ్వాలంటూ ఒత్తిడి పెంచడంతో వారిని ఒక్కొక్కరిగా మట్టుపెట్టాలని కరీమాబేగం ప్ల్లాన్ చేసింది. ఇందులో భాగంగానే మొదట మహబూబాబీ వద్ద తీసుకున్న అప్పును తిరిగి చెల్లిస్తానంటూ మాట ఇచ్చింది. గత మార్చి నెలలో మొయినాబాద్లోని ఫామ్ హౌస్ వద్దకు రావాలంటూ ఇంటికి పిలిపించుకొని చెప్పింది. ఫామ్ హౌస్కు వెళ్లిన తరువాత మహబూబాబీని ముగ్గురు కలిసి హత్య చేసి పూడ్చేశారు.
అబేదా బేగంను కూడా అక్కడకు ఈ నెల 5న పిలిపించి.. హత్య చేశారు. ఇద్దరిని ఫామ్ హౌస్లో గుంత తీసి పూడ్చేశారు. ఫామ్ హౌస్ యజమాని 75 సంవతసరాల వృద్ధుడు కావడంతో ఆయన అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడు. దీంతో అక్కడ నయీ ందే రాజ్యాం కావడంతో ఎవరికి అనుమానం రాలేదు. రెండో హత్య కూడా చేసిన తరువాత మూడో హత్యకు కూడా కుట్ర చేసినా, బాధితురాలు తాను ఒంటరిగా మొయినాబాద్కు రానంటూ తేల్చి చెప్పింది. డబ్బు ఇవ్వాలంటే ఇక్కడే ఇవ్వాలంటూ చెప్పడంతో కరీమాబేగం ఆలోచనలో పడింది.
ఇంతలో పోలీసులు ఇద్దరు మహిళల అదృశ్యం కేసుపై దర్యాప్తు చేస్తుండగా, ఈ ముఠా పట్టుబడింది. అయితే ముఠాను విచారిస్తున్న క్రమంలో తమకు ఫామ్ హౌస్కు రావాలంటూ పిలుపు వచ్చిందంటూ ఆరు మంది మహిళలు తాండూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జంట హత్యల కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు దర్యాప్తులో ఇంకా కొద్ది ఆలస్యమై ఉంటే మరో ప్రాణం కూడా పోయేదంటూ స్థానికంగా చర్చ జరుగుతున్నది. ఈ కేసు విచారణలో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి.