– సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 ( నమస్తే తెలంగాణ) ;మహాశివరాత్రి వేళ నగరం ఆధ్యాత్మిక వాతావరణంతో పరిఢవిల్లింది. “హరహర మహాదేవ… శంభో శంకర.. దుఃఖ హర..భయ హర.. దారిద్య్ర హర.. అనారోగ్య హర.. ఐశ్వర్య కర.. ఆనంద కర..” అంటూ నగరంలోని శివాలయాలన్నీ మార్మోగాయి. భక్త జనకోటి ఈశ్వర నామస్మరణతో ఊగిపోయింది. శనివారం మహా శివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాల్లో పూజలు చేశారు. నిష్టగా ఉపవాసం ఉండి… రాత్రంతా జాగారం చేసి శివుడి నామస్మరణలో మునిగిపోయారు. కీసర బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తులు పోటెత్తారు. స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, అభిషేకాలు చేసి తన్మయత్వం చెందారు.
కీసర, ఫిబ్రవరి 18 : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కీసరగుట్ట పుణ్యక్షేత్రం శివనామస్మరణతో మార్మోగింది. శనివారం భక్తులు భారీగా తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకొన్నారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి సన్నిధికి చేరుకున్న భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
భక్తుల సౌకర్యార్థం భారీ ఏర్పాట్లు..
కీసరగుట్టకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. పోలీసు యంత్రాంగం భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
కీసరగుట్టలో నేడు..
కీసరగుట్ట ఆలయంలో స్వామివారికి ఆదివారం ఉదయం 5.30గంటలకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, కల్యాణ మంటపంలో సామూహిక అభిషేకాలు, ఉదయం 9 రుద్రస్వాహకార హోమం, రాత్రి 7గంటలకు ప్రదోషకాల పూజ, నీరాజన, మంత్రపుష్పం, రాత్రి 7గంటలకు శ్రీ స్వామివారి విమాన రథోత్సవం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు.
ఇషా ధ్యాన కేంద్రం నుంచి జగ్గీ ప్రవచనాలు
సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ) : కోయంబత్తూర్లోని ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శివరాత్రి వేడుకులు ప్రారంభమయ్యాయి. శనివారం సాయంత్రం 6గంటల నుంచి నేటి ఉదయం వరకు కోయంబత్తూర్లోని ఇషా ఫౌండేషన్ కేంద్రం నుంచి భక్తుల కోసం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని అమీర్పేట్, కూకట్పల్లి, కవాడిగూడ, తార్నాకల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆధ్యాత్మిక కేంద్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. భక్తుల కోసం ఏర్పాటు చేసిన స్క్రీన్ల ద్వారా ఇషా ఫౌండేషన్ ధ్యాన కేంద్రం నుంచి భక్తులకు సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రవచనాలు అందించారు.
మహాశివరాత్రి
పర్వదినం సందర్భంగా మంత్రి చామకూర మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్లతో పాటు పలువురు స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున 4గంటలకే మంత్రి కుటుంబ సమేతంగా విచ్చేసి గర్భాలయంలో మొదటి పూజ చేశారు. ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఘనంగా స్వాగతం పలికి ఆలయంలోకి ఆహ్వానించారు. అలాగే ఎండోమెంట్ కమిషనర్ అనిల్కుమార్, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నేత నక్క ప్రభాకర్గౌడ్ స్వామి వారిని దర్శించుకున్నారు.
కాశీబుగ్గ శివాలయంలో మేయర్ పూజలు
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బహదూర్పురలోని పురాతన శివాలయంలో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రత్యేక పూజలు చేశారు. కాశీబుగ్గ శివాలయ పాతాళ ఈశ్వరునికి అభిషేకాదులు నిర్వహించిన మేయర్కు ఆలయ కమిటీ సభ్యులు తీర్థప్రసాదాలను అందించి, దేవాలయ జ్ఞాపికలను బహూకరించారు.
స్వామి వారి సేవలో స్మితా సభర్వాల్..
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా కీసర గుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామిని సీఎంవో కార్యదర్శి సిత్మా సభర్యాల్, ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్రెడ్డి దర్శించుకున్నారు. కాగా, వారికి జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్, ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణలు, పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
మంత్రి తలసాని పూజలు
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ శనివారం అమీర్పేట్ హనుమాన్ దేవాలయంలోని రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.