GHMC | ఎప్పుడో చేయాల్సిన పనిని.. చాలా ఆలస్యంగా మొదలు పెట్టింది విద్యుత్ శాఖ. వర్షాకాలం వస్తుందంటే చాలు.. గాలి, దుమారంతో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడితే.. ఒక్కసారిగా సరఫరా నిలిచిపోతున్నది. ఇలాంటి పరిస్థితి ఎదురుకావద్దంటే ముందస్తు ప్రణాళికతో కార్యాచరణ చేపట్టాల్సిన దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చాలా ఆలస్యంగా మేల్కొంది. ఒకవైపు వర్షాలు కురుస్తుంటే… మరో వైపు చెట్ల కొమ్మల నరికివేతకు కార్యాచరణ ప్రకటించింది.
గత వారం రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షాలకు విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయాలు ఎదురవుతున్నాయి. కొన్ని చోట్ల చెట్లు, చాలా ప్రాంతాల్లో కొమ్మలు వర్షంతో పాటు వచ్చే గాలి దుమారానికి విద్యుత్ తీగలపై పడుతున్నాయి. దీంతో ఒక్కసారిగా సరఫరా నిలిచిపోతున్నది. దీంతో గంటల తరబడి శ్రమించి.. సరఫరాను పునరుద్ధరిస్తున్నది విద్యుత్ శాఖ. కాగా, ఇలాంటి పరిస్థితి రాకుండా గతంలో వర్షాకాలానికి రెండు, మూడు నెలల ముందే సర్కిళ్ల వారీగా ఉదయం, మధ్యాహ్నం వేళల్లో మరమ్మతు నిర్వహణ పేరిట పనులు చేపట్టేవారు. – సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ)
గ్రేటర్ ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ సరఫరా నెట్వర్క్ను పెంచుకుంటూ వెళ్లాల్సిన బాధ్యత విద్యుత్ శాఖపై ఉంటుంది. ఈ వేసవిలో కొత్త విద్యుత్ నెట్ వర్క్కు సంబంధించి పనులను కాంట్రాక్టర్లు చేపట్టిన తర్వాత వాటిని అనుసంధానం చేసేందుకు ఇవ్వాల్సిన లైన్ క్లియరెన్స్ (ఎల్సీ) అనుమతులను పూర్తిగా నిషేధించారు. దీంతో 2 నెలలకు పైగా ఎల్సీలు ఇవ్వకపోవడంతో చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిపి వేసి.. కొత్త నెట్ వర్క్ అనుసంధానం చేయాల్సి ఉంది. అదే సమయంలో చెట్ల కొమ్మల నరికివేత కోసం మరమ్మతులు, నిర్వహణ పేరిట విద్యుత్ను ప్రత్యేక సమయాల్లో నిలిపివేయాల్సి ఉంటుంది. దీంతో వర్షాకాలం ప్రారంభం నుంచే విద్యుత్ కోతలు తప్పనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గ్రేటర్ పరిధిలో ఉన్న మొత్తం 9 సర్కిళ్ల పరిధిలో కోర్ సిటీతో పాటు శివారు ప్రాంతాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా చెట్ల కొమ్మలను తొలగించాల్సి ఉంటుందని, దీనికి ఎక్కువ సమయం పడుతుందని విద్యుత్ శాఖ సిబ్బంది పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే కేసీఆర్ ప్రభుత్వంలో ముందస్తు కార్యాచరణ ప్రకారం.. విద్యుత్ లైన్ల నిర్వహణ, మరమ్మతు పనులు నిరంతరంగా చేపడుతూ నాణ్యమైన విద్యుత్ సరఫరా ఇచ్చేవారు. ప్రస్తుతం విద్యుత్ సరఫరా విషయంలో ఉన్నతాధికారుల నిర్ణయాలతో గందరగోళ పరిస్థితి నెలకొన్నది.
జూన్ మొదటి వారం నుంచే వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ సూచించింది. దీంతో కేవలం 10 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇంత తక్కువ సమయంలోనే మొత్తం 9 సర్కిళ్ల పరిధిలో చెట్ల కొమ్మ తొలగింపు ప్రక్రియ, కొత్త విద్యుత్ లైన్ల అనుసంధానం ఒకే సమయంలో రెండు రకాల పనులు చేయాలంటే..కోతలు విధించాల్సిన పరిస్థితి ఉంటుందని విద్యుత్ శాఖలో ఆందోళన మొదలైంది. కరెంటు సరఫరాలో కోతలు పెడితేనే ఈ పనులన్నీ పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుందని, లేదంటే తరచూ అంతరాయాలు ఉండే అవకాశం ఉన్నదని నిపుణులు పేర్కొంటున్నారు.