హిమాయత్ నగర్, ఫిబ్రవరి4: ఛత్తీస్గఢ్(Chhattisgarh) రాష్ట్రంలో కొనసాగుతున్న బూటకపు ఎన్ కౌంటర్లను(Fake encounters )తక్షణమే నిలిపివేయాలని పలువురు వక్తలు ముక్తకంఠంతో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక రాష్ట్ర కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ జి .లక్ష్మణ్, తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. నారాయణరావు, హైకోర్టు న్యాయవాది సురేష్ కుమార్, చైతన్య మహిళా సంఘం వేదిక రాష్ట్ర కో- కన్వీనర్ జి. జ్యోతి మాట్లాడారు.
ఛత్తీస్గఢ్లో రాష్ట్రంలోని బీజాపూర్, గంగులూరులో ఈనెల 1న జరిగిన ఎన్ కౌంటర్ లో ఎనిమిది మంది మావోయిస్టులు చనిపోయినట్లుగా ఆ రాష్ట్ర పోలీసులు ప్రకటించారని తెలిపారు. 13 నెలల కాలంలో 352 మందిని చంపితే ఇందులో ఆదివాసీలు గిరిజనులే 250 పైగా ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మనిషి జీవించే హక్కు పట్ల ఏ ప్రభుత్వమైనా బాధ్యతయుతంగా ఉండాలే తప్ప వెంటాడి చంపి వేయడం చట్ట విరుద్ధమని మండిపడ్డారు. డబల్ ఇంజన్ సర్కారుగా ప్రకటించుకున్న బిజెపి ప్రభుత్వం పూర్తిగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాలన చేస్తుందని విమర్శించారు.
ఆపరేషన్ కగార్ హత్యా కాండను ఆపివేసి, ఆదివాసీ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన 600 క్యాంపులను తక్షణమే ఎత్తివేయాలన్నారు. ఆదివాసి హత్యలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే సమగ్రమైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దేశంలోని ప్రజాస్వామిక వాదులు,హక్కుల సంఘాలు స్పందించి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రజాస్వామిక వాతావరణం నెలకొనేందుకు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో శ్రామిక స్పందన జాతీయ కార్యదర్శి షేక్ షావలి, టీపీఎఫ్ నేత రాంబాబు, ప్రతినిధులు పద్మకుమారి, చంద్రమౌళి, జాన్, తదితరులు పాల్గొన్నారు.