ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అందులో అడుగుపెట్టింది మొదలు.. తిరిగి బయటకు వచ్చేవరకు జేబులకు చిల్లులు పడుతూనే ఉంటాయి. పైసా తక్కువ ఉన్నా.. బయటకు గెంటేస్తారు. ఇది మన అందరికీ తెలిసిన ప్రైవేటు దవాఖానల పరిస్థితి. కానీ నగర శివారు దుండిగల్ సమీపంలోని క్యాష్ కౌంటర్ లేని ఓ ప్రైవేటు సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిరుపేదలకు ఆశాజ్యోతిగా నిలుస్తున్నది. రెండేండ్ల కిందట అమ్మకు ప్రేమతో.. మంత్రి కేటీఆర్ తలపెట్టిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’ స్ఫూర్తిగా.. 450 పడకలతో స్థాపించిన ‘అరుంధతి’ దవాఖానలో ఇన్పేషెంట్లకు మందులతో సహా ఖరీదైన వైద్యం సైతం ఉచితంగానే అందజేస్తున్నారు. తమ ఫౌండేషన్ ద్వారా అందించే సేవలు ఎంతో సంతృప్తినిస్తున్నాయని ఆస్పత్రి వ్యవస్థాపకుడు, మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు.
కార్పొరేట్ వైద్యం… ప్రపంచ వ్యాప్తంగా కనక వర్షాన్ని కురిపించే రంగమిది. చిన్న పాటి ప్రైవేటు ఆస్పత్రి మొదలు… కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వరకు… స్ట్రెచర్ పై పడుకున్న మొదలు తిరిగి డిశ్చార్జి అయ్యేవరకు.. వేలు, లక్షల రూపాయల బిల్లులను చేతిలో పెడతారు. ఇది అందరికీ తెలిసిన సత్యమే… దాదాపు ప్రతి ఒక్కరి అనుభవంలో ఉన్న దృశ్యాలే. కానీ అసలు క్యాష్ కౌంటర్ లేని ఓ ప్రైవేటు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఊహించగలమా?! అరుంధతి ఆస్పత్రికి వెళితే కళ్ల ముందు వైద్య సేవలు అందుకునే రోగులు ఉంటారే తప్ప.. రోగిగానీ వారి సహాయకులు గానీ జేబులో చేతులు పెట్టేది లేదు. చిల్లిగవ్వ చెల్లించనవసరం ఉండదు. చివరకు ఆస్పత్రిలోని ఇన్పేషెంట్లకు మందులతో సహా ఖరీదైన శస్త్ర చికిత్సలు… వెంటిలేటర్ పై ఉంచి అందించే ఖరీదైన వైద్యం సైతం ఉచితంగానే అందుతుంది. మరి… ఇంత ఖరీదైన వైద్యాన్ని యాజమాన్యం ఉచితంగా అందించడం వెనక కారణం… అమ్మకు ఇచ్చిన మాట! మంత్రి కేటీఆర్ తలపెట్టిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’ స్ఫూర్తి!! అంటున్నారు అరుంధతి ఆస్పత్రి వ్యవస్థాపకుడు మర్రి రాజశేఖర్రెడ్డి. ‘పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తుంటే వాళ్ల నుంచి వచ్చే
దీవెనలు వెలకట్టలేనివిగా ఉంటాయి’. ప్రజా జీవితంలో ఉన్నందుకు మర్రి రాజశేఖర్రెడ్డి ఫౌండేషన్ ద్వారా అందించే సేవలు ఎంతో సంతృప్తిని ఇస్తున్నాయని వారు చెబుతున్నారు.
– సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 12(నమస్తే తెలంగాణ)/కంటోన్మెంట్
మేడ్చల్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ సమీపంలో ఉన్న గండిమైసమ్మ వద్ద అరుంధతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ హాస్పిటల్ సుమారు రెండేండ్ల కిందట ప్రారంభమైంది. 450 సూపర్ స్పెషాలిటీ పడకలతో ఏర్పాటైన ఈ ఆస్పత్రిలో ఇప్పుడు ప్రతి రోజు అవుట్ పేషెంట్ల సంఖ్య దాదాపు 600 నుంచి 800 వరకు ఉంటుంది. ఆస్పత్రికి వచ్చిన రోగులు నేరుగా రిసెప్షన్ దగ్గరికి వెళ్లి ఓపీ చిట్టీ తీసుకొని సంబంధిత వైద్యుల దగ్గరికి వెళ్లడమే తప్పా ఎవరినీ కలవాల్సిన అవసరం లేదు. ఫీజులు చెల్లించాల్సిన అవసరం అంతకన్నా ఉండదు. ఇక… వైద్యులు రక్త పరీక్షలు మొదలు ఇతర ఏ పరీక్షలు రాసినా వెంటనే సంబంధిత విభాగానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. అక్కడ కూడా జేబులో నుంచి రూపాయి తీయాల్సిన అవసరం లేదు. ఇలా… ఆ ఆస్పత్రిలో వివిధ రకాల రక్త పరీక్షల కోసం రోజుకు దాదాపు 600కు పైగా నమూనాలు తీసుకుంటారంటే ప్రతి రోజు లక్షల రూపాయల విలువైన పరీక్షలు ఉచితంగానే జరుగుతాయని అర్థమవుతుంది. ఇవే కాదు… రేడియాలజీలోని ఎంఆర్ఐ, సీటీ, యూఎస్జీ, మామోగ్రఫీ పరీక్షలు, కార్డియాలజీ విభాగంలోని ఈసీజీ, 2డీ ఎకో, న్యూరాలజీలోని ఈఈజీ, ఈఎంఎన్జీ, ఆర్థోలోని సీ-ఆర్మ్ వంటి ఖరీదైన పరీక్షలు కూడా ఉచితంగానే చేయడం విశేషం. ఈ నేపథ్యంలో అరుంధతి ఆస్పత్రిలో ఇప్పటివరకు అంటే రెండేండ్లలో దాదాపు 3 లక్షల మంది ఓపీ నమోదు కాగా… పథాలజీ సహా వివిధ రకాల రక్త పరీక్షల సంఖ్య దాదాపు 1.60 లక్షల పైనే. ఎంఆర్ఐ 3 వేల వరకు నమోదు కాగా సీటీ స్కాన్లు ఆరున్నర వేలకు మించి పోయాయి. దాదాపు 10 వేల మందికి ఇప్పటివరకు ఈసీజీ పరీక్షలు చేయగా… 5 వేల మంది వరకు 2డి-ఎకో పరీక్షలు చేశారు.
నేను ఆస్పత్రి నెలకొల్పాలని నిర్ణయించుకున్నప్పుడు ఏ పేరు పెట్టాలని ఆలోచించా. చివరకు మా అమ్మ పేరు మీద పెట్టాలనుకుని… ఆమె దగ్గరికి వెళ్లి ‘నీ పేరు మీద ఆస్పత్రి పెడుతున్నాను’ అని చెప్పా. ‘మనం బాగానే సంపాదిస్తున్నాం కదా… ఆ ఆస్పత్రిలో ఉచితంగా వైద్యం అందించు. అట్లయితేనే నా పేరు పెట్టు’ అని అన్నారు. అమ్మ చెప్పిన మాట కూడా నిజమే కదా… అనుకుని ఉచితంగా వైద్యం అందిస్తానని అమ్మకు మాటిచ్చా. ఇదే తరుణంలో మంత్రి కేటీఆర్ తన పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కింద నిరుపేదలకు చేయూతను అందించే కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నారు. అటు అమ్మకు ఇచ్చిన మాట… ఇటు గిఫ్ట్ ఏ స్మైల్ స్ఫూర్తి… ఎంత ఖర్చయినా ముందుకుపోదాం అనుకుని నిర్ణయించుకున్నా. అలా ప్రారంభమైన ఆస్పత్రికి ఇప్పుడు నెలకు కనీసం రూ.కోటిన్నర వరకు ఖర్చవుతుంది. మేం ఎక్కడా ఎలాంటి హోర్డింగ్గానీ, ప్రచారం గానీ చేపట్టలేదు. కానీ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లే కాదు… తెలంగాణలోని ఇతర జిల్లాలు, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా ప్రజలు వస్తుండటం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ప్రజా జీవితంలో ఉన్న నాకు డిశ్చార్జి అయ్యేటప్పుడు నన్ను కలిసిన వారు చెప్పే కృతజ్ఞతలు దీవెనలా అనిపిస్తాయి.
– మర్రి రాజశేఖర్రెడ్డి, అరుంధతి ఆస్పత్రి వ్యవస్థాపకుడు
అరుంధతి ఆస్పత్రి కార్పొరేట్ సేవలు అందిస్తున్నది. 16 స్పెషలైజ్డ్ విభాగాలు ఉండటంతో పాటు ఖరీదైన వైద్య పరికరాలు, నిష్ణాతులైన వైద్యులు కూడా ఉన్నారు. అందుకే మూడు వేలకు పైగా శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తి చేశారు. జనరల్ మెడిసిన్ విభాగంలో వెంటిలేటర్తో కూడిన ఎంఐసీయూ సదుపాయం ఉంది. ఆస్పత్రిలో 150 మంది వైద్యులు, 251 మంది నర్సులు, 15 మైనర్, తొమ్మిది మేజర్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఇక్కడ క్యాన్సర్కు సంబంధించిన విభాగం ఇంకా ఏర్పాటు కాలేదు. ఎవరైనా రోగులు వస్తే వారిని గుర్తించి… ఇతర ఆస్పత్రులకు రిఫర్ చేయడం వరకు చేస్తున్నారు. అందుకే ఆంకాలజీ విభాగాన్ని కూడా అత్యాధునిక వైద్య పరికరాలతో ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలో ఆ సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని వ్యవస్థాపకుడు మర్రి రాజశేఖర్రెడ్డి తెలిపారు.
మా అమ్మకు ఈ ఆస్పత్రిలోనే ఆపరేషన్ అయింది. ఆమె డిశ్చార్జి అయిన తర్వాత ఇక్కడి నుంచి ఇంటికి తీసుకుపోయిన. ఆమెను ఇంట్ల వదిలిపెట్టి బైక్ పై బయటికి వచ్చిన. బైక్ స్కిడ్ (జారిపడి) అయి కింద పడటంతో నా దవడ భాగం పూర్తిగా దెబ్బతింది. బోన్ కూడా ఇరిగిందంట. నేను కూడా ఈ ఆస్పత్రికే వచ్చిన. రెండు రోజుల కింద ఆపరేషన్ చేసిండ్రు. డాక్టర్లు ఆర్థోతో పాటు ప్లాస్టిక్ సర్జరీ చేసిండ్రు. నా మొహం సాధారణ స్థితికి వచ్చింది. ఇక్కడ పైసల్లేకుండా వైద్యం చేస్తరని మా ఏరియాల అందరికీ తెలుసు. ఉచితంగా చేయడం గొప్ప విషయం.
– నసీర్ హుస్సేన్, హఫీజ్పేట, మియాపూర్
ఆపద సమయంలో అయినవారే పట్టించుకోని ఈ రోజుల్లో మానవతా దృక్పథంతో మర్రి రాజశేఖర్రెడ్డి ఇలా పేదలకు ఉచిత వైద్యం అందించడం చాలా గొప్ప విషయం. మాది సంగారెడ్డి జిల్లా గుమ్మడిపల్లిలోని బొంతపల్లి గ్రామం. గుండె రక్త నాళాల్లో మూడు బ్లాక్లు ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. ఇక్కడికి వచ్చిన తరువాత వైద్యులు అన్ని పరీక్షలు నిర్వహించి రెండు రోజుల క్రితం ఒక స్టంట్ వేశారు. మరో నెల రోజుల అనంతరం రెండో స్టంట్ వేస్తామని చెప్పారు. ఇదే వైద్యం బయట చేయించుకుంటే రూ.3నుంచి 4 లక్షల వరకు ఖర్చు అయ్యేది. కానీ ఇక్కడ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వైద్యం చేశారు. గతంలో మా గ్రామానికి చెందిన పలువురు ఇక్కడ వైద్యం చేయించుకోవడంతో వారు చెప్తేనే మేం ఇక్కడికి వచ్చాం.
– టీ.లక్ష్మి, బొంతపల్లి, సంగారెడ్డి
మాది నర్సాపూర్లోని శివంపేట బిజిలిపల్లి గ్రామం. వెన్నుపూస సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నా. ఏ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లినా లక్షలు అడుగుతున్నరు. అరుంధతి హాస్పిటల్లో పైసలు తీసుకోకుండానే వైద్యం చేస్తరని ఇక్కడికి వచ్చిన. ఒక్క పైసా తీసుకోకుండా డాక్టర్లు వైద్యం చేస్తున్నరు. పరీక్షలు కూడా చేసిండ్రు. రెండ్రోజుల్లో ఆపరేషన్ చేస్తామని డాక్టర్లు చెప్పిండ్రు. ఇక్కడ అన్ని సౌలత్లు మంచిగున్నయి. పేదలకు చాలా ఉపయోగం.
– చిట్యాల సాయమ్మ, బిజిలిపల్లి, నర్సాపూర్
నేను టైలర్గా పని చేస్తున్న. ఫైల్స్ సమస్యతో బాధపడుతున్న. ఇక్కడ పైసలు లేకుండానే వైద్యం చేస్తరని తెలుసు. అందుకే ఇక్కడికి వచ్చిన. ఆపరేషన్ చేయడం అయిపోయింది. ఇప్పుడు పాణం బాగుంది. ప్రైవేటు ఆస్పత్రులకు పోతే లక్షలకు లక్షలు కావాలంటరు. కానీ ఇక్కడ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వైద్యం చేస్తున్నరు. మర్రి రాజశేఖర్రెడ్డికి కృతజ్ఞతలు.
– శైలేశ్కుమార్, బోయిన్పల్లి, కంటోన్మెంట్
సాధారణ ఓపీ నిర్వహించడం… వివిధ రకాల పరీక్షలు చేయడమే కాదు! కార్పొరేట్ ఆస్పత్రుల్లో లక్షలకు లక్షలు బిల్లులు వేసే శస్త్ర చికిత్సలు కూడా అరుంధతి ఆస్పత్రిలో ఉచితంగానే చేస్తుండటం గొప్ప విషయం. ఎండోస్కోపి మొదలు కార్డియో థొరాసిక్ (సీటీ) శస్త్ర చికిత్స (ఓపెన్ హార్ట్ సర్జరీ) వరకు దాదాపు మూడు వేలకు పైగా ప్రధాన శస్త్ర చికిత్సలు విజయవంతంగా చేసినట్లు ఆస్పత్రి డీన్ నీలగిరి ఉదయ్కుమార్ తెలిపారు. వీటిలో 572 జనరల్ సర్జరీలు పూర్తవ్వగా… యూరాలజీ విభాగంలో 247, రెండువందలకు పైగా హృద్రోగ సంబంధిత శస్త్ర చికిత్సలు, న్యూరాలజీ విభాగంలో ఐదారు కీలకమైనవి సహా పదికి పైగా శస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తి చేశామన్నారు. రోజుకు పద్నాలుగు మంది వరకు డయాలసిస్ రోగులకు సేవలు అందుతాయని చెప్పారు. గత రెండు సంవత్సరాల్లో విషమ పరిస్థితుల్లో వచ్చిన 90 మంది రోగులకు వెంటిలేటర్పై వైద్య సేవలు అందించామన్నారు. ల్యాప్రోస్కోపీ వంటి ప్రొసీజర్స్ ప్రతి నెలా వందల్లో చేస్తామన్నారు. ఈ క్రమంలో శస్త్ర చికిత్సలు నిర్వహించిన సమయంలో రోగులు వారం, పది రోజుల పాటు బెడ్పైనే ఉండాల్సి ఉంటుంది. ఆ సమయంలో రోగులకు కావాల్సిన సరైన ఆహారంతో పాటు రోజువారీ మందులు, ఇంజక్షన్లు, ఇతరత్రా సర్జికల్ సామగ్రి కూడా ఉచితంగానే అందిస్తారు. డిశ్చార్జి తర్వాత వారానికి సరిపడే మందులు కూడా ఇచ్చి పంపిస్తామని ఉదయ్కుమార్ చెప్పారు.