బంజారాహిల్స్, జూలై 5: బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని తట్టిఖానా రిజర్వాయర్ పక్కన సుమారు రూ.150 కోట్ల విలువైన జలమండలి స్థలాన్ని కాజేసేందుకు ప్రైవేటు వ్యక్తులు మరోసారి ప్రయత్నాలు చేస్తున్న వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. స్థలాన్ని ఎట్టి పరిస్థితిలో కబ్జా కాకుండా చూడాలని ఉన్నతాధికారుల ఆదేశాలతో రంగంలోకి దిగిన జలమండలి విజిలెన్స్ విభాగం అధికారులు శనివారం అక్కడ ప్రత్యేక పికెట్ ఏర్పాటు చేశారు. ‘జలమండలి స్థలంలో మళ్లీ తిష్ట’ పేరుతో శనివారం నమస్తే తెలంగాణలో ప్రచురించిన కథనంపై స్పందించిన అధికారులు నిఘాను మరింత పెంచారు.
వివరాల్లోకి వెళ్తే.. షేక్పేట మండల సర్వే నెంబర్ 403/పి, టీఎస్ నెంబర్-1/1/1, బ్లాక్ హెచ్,వార్డు -10పరిధిలోకి వచ్చే బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఎదురుగా ఉన్న 5 ఎకరాల ప్రభుత్వ స్థలంలోని 1.20 ఎకరాల స్థలాన్ని జలమండలికి కేటాయించడంతో పాటు పంచనామా చేసి అప్పగించారు. కాగా ఈ స్థలాన్ని బోగస్ పత్రాలతో కబ్జా చేసేందుకు గతంలోనే పార్థసారథి అనే వ్యక్తితో పాటు అతడి మనుషులు ప్రయత్నాలు చేశారు. వేరే ప్రాంతానికి చెందిన సర్వే నెంబర్లతో పత్రాలు సృష్టించడంతో పాటు కోర్టులో కేసులు వేసి వివాదాలు సృష్టించే ప్రయత్నం చేసారు. ఈ కబ్జాల వ్యవహారంపై ‘నమస్తే తెలంగాణ ‘ వరుస కథనాలు ప్రచురించడంతో స్థలంలో తిష్టవేసిన పార్థసారథి అనే వ్యక్తితో పాటు అతడి అనుచరులపై బంజారాహిల్స్ పోలీసులు రెండు నెలల క్రితం క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఆ సమయంలో కొన్నాళ్లపాటు జలమండలి విజిలెన్స్ విభాగం సిబ్బంది అక్కడే ఉండి స్థలంలోకి ఎవరూ రాకుండా చూశారు.
అయితే ఇటీవల విజిలెన్స్ బందోబస్తును తొలగించడంతో పార్థసారథికి చెందిన అనుచరులు గురువారం రాత్రి మరోసారి ప్రవేశించడంతో పాటు వేటకుక్కలను, ఆవులను అక్కడ ఉంచారు. ఈ మేరకు స్థానిక జలమండలి సిబ్బంది ఫిర్యాదు చేయడంతో విజిలెన్స్ డీఎస్పీ జ్ఞానేందర్రెడ్డి ఆద్వర్యంలో సిబ్బంది శుక్రవారం మధ్యాహ్నం పరిశీలన నిర్వహించారు. అక్కడున్న వారిని వెళ్లిపోవాలని సూచించగా తమకు కోర్టు ఆదేశాలు ఉన్నాయంటూ బుకాయించారు. కాగా శనివారం నమస్తే తెలంగాణ పత్రికలో కథనం రావడంతో అప్రమత్తమయిన జలమండలి అధికారులు ఉదయాన్నే అక్కడకు చేరుకుని ప్రైవేటు వ్యక్తులను పంపించి వేశారు. జలమండలి స్థలంలో ఆక్రమణలకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ తట్టిఖానా జలమండలి సెక్షన్ మేనేజర్ రాంబాబు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ స్థలాన్ని ఎట్టి పరిస్థితిలో కబ్జా కానివ్వబోమని, చట్టపరమైన అన్ని చర్యలు తీసుకోవడంతో పాటు నిరంతరం నిఘా ఏర్పాటు చేస్తామని జలమండలి జీఎం ప్రభాకర్రావు తెలిపారు.