సిటీబ్యూరో, జనవరి 22 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అమలవుతున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో స్వయం సహాయక మహిళా సంఘాలను భాగస్వామ్యం చేస్తున్నారు. అంతేకాకుండా వారిని ఆర్థికంగా, సామాజికంగా మరింత బలోపేతం చేయడానికి జీహెచ్ఎంసీ చర్యలు చేపడుతున్నది. ఈ మేరకు స్వయం సహాయక బృందాల మహిళా సభ్యుల కుటుంబాల వివరాలతో కూడిన ప్రొఫైల్ను రూపొందిస్తున్నారు. స్వయం సహాయక మహిళల ఆరోగ్యం, విద్యార్హతలు, ఉపాధి, కుటుంబ సభ్యుల వివరాలతో కూడిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. వీటితో పాటు స్వయం సహాయక సంఘాల పనితీరును ఆక్టివేట్ చేయడంతో పాటు కొత్త మహిళా సంఘాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగానే 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 952 సంఘాలను కొత్తగా ఏర్పాటు చేయగా.. గడిచిన 8 సంవత్సరాలుగా 34,787 సంఘాలు ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. ఒక్కో బృందంలో 10 మంది చొప్పున 3,47,870 మంది సభ్యులు నమోదు చేసుకున్నట్లు అధికారులు వివరించారు.
గ్రేటర్లో స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు నూతన సహాయక సంఘాలు ఏర్పాటు చేసి వారి ఆర్థిక స్వావలంబన దిశగా జీహెచ్ఎంసీ కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మురికివాడల్లోని ఔత్సాహిక మహిళలకు స్వయం ఉపాధి చూపిస్తున్నారు. ఉత్పాదక కార్యకలాపాలు చేసుకోవడానికి, చిన్న చిన్న వ్యాపారాలను పెంపొందించడానికి, నిరుపేదల కుటుంబాలను ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చేయడానికి బ్యాంక్ లింకేజి ద్వారా రుణాలు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే 2022-23 ఆర్థిక సంవత్సరంలో 4540 స్వయం సహాయక సంఘాలకు రూ.354.26 కోట్లు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. 2014-15 నుంచి 2022-23 వరకు 74,877 స్వయం సహాయక సంఘాలకు రూ.3014.31కోట్లు మంజూరు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.