Padma Rao Goud | సికింద్రాబాద్, మార్చి 24 : ప్రజల ఆశీర్వాదం పద్మారావుగౌడ్కు ఉన్నదని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తాడని సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పద్మారావుగౌడ్ను ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు పద్మారావు నివాసంలో సమావేశమయ్యారు.
ముందుగా ఆయనకు అభినందనలు తెలిపి ఎన్నికల ప్రచార కార్యాచరణపై చర్చించారు. మాజీ మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, నేతలు ముఠా జై సింహ, మన్నె గోవర్ధన్తో సహా ఏడు నియోజకవర్గాల నేతలు, కార్పొరేటర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రెండు రోజుల్లో తెలంగాణ భవన్లో పూర్తి స్థాయి సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రచార కార్యక్రమాలను ప్రకటిస్తామని తెలిపారు.
సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. గ్రేటర్ ప్రజలు శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్ అంటే గుర్తు పట్టనివారు ఉండరని, ప్రజలకు సేవ చేయడంతోనే తమకు పేరు వచ్చిందని పేర్కొన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్కు డైనమిక్ ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు.
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పోని కరెంటు ఇప్పుడు ఎందుకు పోతుందని ప్రజలు అడుగుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు కాలేదని తెలిపారు. కిషన్ రెడ్డి ఈ ప్రాంతానికి చేసిందేమి లేదన్నారు. గల్లీ లీడర్లు లేనిది ఢిల్లీ ఎకడిదని పద్మారావు ప్రశ్నించారు. మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. దానం నాగేందర్ గురించి మాట్లాడాలంటే సిగ్గనిపిస్తుందని, ఎప్పుడూ పార్టీ మారుతూనే ఉంటాడని విమర్శించారు.
సికింద్రాబాద్ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ను అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించగానే ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం సికింద్రాబాద్లో జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లి, ఓటు అభ్యర్థిస్తామని తెలిపారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలుచేయకుండా ప్రజలను మోసం చేస్తుందని మాజీ మంత్రి మహమూద్ అలీ అన్నారు. రైతు బంధు, రైతు భరోసాపై ప్రభుత్వం నుంచి సంకేతాలు లేవన్నారు. రేవంత్ రెడ్డి అబద్దాల ముఖ్యమంత్రి అన్నారు. ఉద్యమ కారుడైన పద్మారావు గౌడ్ను అందరం కలిసి భారీ మెజారిటీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.
దానం నాగేందర్ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెల్వదని, గెలిచినా కాంగ్రెస్ పార్టీలో ఉంటాడనే గ్యారెంటీ లేదని జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కేంద్ర మంత్రి గా ఉన్న కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ అభివృద్ధిని విస్మరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు హేమ, శైలజ, సునీత ముషీరాబాద్ యువ నేత ముఠా జైసింహ, ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఇన్చార్జి మన్నె గోవర్దన్, యువ నేత రామేశ్వర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.