హైదరాబాద్ : అనాథాశ్రమాలు, వృద్ధాప్య వసతి గృహాలకు అదేవిధంగా రహదారులపై వెళ్లే వాహన డ్రైవర్లకు ఉచితంగా ఆహారాన్ని అందించే స్వస్థ్య సేవ కార్యక్రమాన్ని పలు ఎన్జీవోల సహకారంతో రాచకొండ పోలీసులు మంగళవారం ప్రారంభించారు. ఉప్పల్లోని అభి సాయి దత్తా చైల్డ్ హోంలో రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ ఎం.భగవత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రాచకొండ పోలీసులు 18 అనాథాశ్రమాలు, వృద్ధాప్య వసతి గృహాలను దత్తత తీసుకున్నారు. వారికి రెండు నెలల పాటు ఒక పూట భోజనం పంపిణీ చేయనున్నారు. మంచి భోజనం అందించడం ద్వారా వారి శారీరక ఆరోగ్యంతో పాటు పరోపకార సహాయమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ప్రారంభించినట్లు సీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కలిగిన అగర్వాల్ సమాజ్తో పాటు హెచ్ఎన్ఎస్ చికిత్సాలయ్, హర్యానా నాగ్రి సంఘ్ కు సీపీ కృతజ్ఞతలు తెలిపారు. కమిషనర్ అనాథాశ్రమంలోని దాదాపు 30 మంది పిల్లలకు భోజనం వడ్డించి వారితో కాసేపు ముచ్చటించారు.