మేడ్చల్, ఆగస్టు 26(నమస్తే తెలంగాణ) : రెండవ విడత గొర్రెల పంపిణీకి పశుసంవర్ధక శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో రెండవ విడతలో 1280 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేయనున్నారు. మొదటి విడతలో 3866 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను అందజేయగా, రెండవ విడతలో 1280 మంది లబ్ధిదారులకు అందజేయనున్నారు. లబ్ధిదారులు రూ.43,750 డీడీల ద్వారా పశుసంవర్ధక శాఖకు చెల్లించగా ప్రభుత్వం 75శాతం సబ్సిడీపై 1లక్షా 75 వేల విలువ గల 20 గొర్రెలు, ఒక మేకపోతు ఉన్న యూనిట్ను అందజేస్తున్నారు.
గొర్రెలకు బీమా పరిహర పథకం అమలు
గొర్రెల యూనిట్లు పొందిన లబ్ధిదారులు నష్టపోకుండా ఉండేలా బీమా పరిహారం పథకాన్ని వర్తింపజేస్తున్నారు. మొదటి విడతలో గొర్రెల పంపిణీలో చనిపోయిన గొర్రెలకు బీమా పరిహారాన్ని మంజూరు చేసి 1479 గొర్రెలను మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా తిరిగి ఇప్పించినట్లు అధికారులు పేర్కొన్నారు. త్వరలోనే మిగతా 582 గొర్రెలకు బీమా పరిహారం అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.