మేడ్చల్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టి చరిత్ర సృష్టించిందని రాష్ట్రకార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో మంగళవారం ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమంపై జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాశ్రెడ్డి, కలెక్టర్ హరీశ్ సంబంధిత శాఖల అధికారులతో అవగహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి హాజరై అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. శిబిరాల నిర్వహణతో పాటు కంటి పరీక్షలు నిర్వహించేందుకు వైద్యులు, సిబ్బంది ఇంటివద్దకే వస్తారని తెలిపారు.
కంటి వెలుగు ప్రజలకు వరం
ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు ప్రజలకు వరమని, దీనిని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి అన్నారు. ఈ విషయంలో ఆయా మండలాల ఎంపీడీవోలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు అవగాహన కల్పించి విజయవంతం చేయాలన్నారు. క్యాంపు నిర్వహించే వద్దకు రాని వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే కంటి పరీక్షలు నిర్వహించేలా చూడాలన్నారు.
-జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి
కంటి వెలుగుపై విస్తృత ప్రచారం
కంటి వెలుగు కార్యక్రమంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని ఎమ్మెల్యే బేతి సుభాశ్రెడ్డి అన్నారు. కంటి చూపుతో ఎవరూ బాధపడకూడదనే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, అవసరమైన చోట్ల మరిన్ని క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సుభాశ్రెడ్డి సూచించారు.
-ఎమ్మెల్యే బేతి సుభాశ్రెడ్డి
27,51,810 మందిని గుర్తించాం: కలెక్టర్ హరీశ్
కంటి వెలుగు పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ హరీశ్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా 27,51,810 మందిని గుర్తించామని వారందరికి కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 480 లోకేషన్లు 79 బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లాలో వందశాతం విజయవంతం అయ్యేలా అధికారులు కృషి చేయాలని, ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదన్నారు. సదస్సులో అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ ఆగ్యస్త, జిల్లా వైద్యాధికారి పుట్ల శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దర్గా దయాకర్రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, మేయర్లు జక్క వెంకట్రెడ్డి, బుచ్చిరెడ్డి, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.