సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్లో గులాబీ ఫైటర్స్ ఖరారయ్యారు. ఎన్నికలకు మూడు నెలల ముందుగానే గులాబీ బాస్, సీఎం కేసీఆర్ సమరశంఖం పూరించారు. ముచ్చటగా మూడోసారి అధికారమే మనదేననే భరోసాతో మూడు జిల్లాల్లో అభ్యర్థులను ప్రకటించారు. తొలిజాబితాలో ఉప్పల్ నియోజకవర్గం మినహా మెజార్టీ స్థానాల్లో సిట్టింగులకే సీట్లు దక్కాయి. ఉప్పల్ నుంచి ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి స్థానంలో బండారి లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వగా, ఎమ్మెల్యే సాయన్న మరణంతో ఖాళీ అయిన కంటోన్మెంట్లో ఆయన కూతురు లాస్య నందితకు ఛాన్స్ ఇచ్చారు. పాతనగరంలో పార్టీ విధేయులకు ప్రజాక్షేత్రంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మరో అవకాశం కల్పించారు. నాంపల్లి, గోషామహల్ నియోజకవర్గ స్థానాలపై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నది. ఇదిలా ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు కేటాయించడంతో వారంతా హ్యాట్రిక్పై గురి పెట్టారు. తమ నాయకులు టికెట్ దక్కడంతో గులాబీ శ్రేణుల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. పలు చోట్ల భారీ ర్యాలీలు, మిఠాయిల పంపిణీ, పటాకుల మోత, క్షీరాభిషేకాలు నిర్వహించారు. ఇదిలా ఉంటే ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఖరారుతో ప్రతిపక్ష పార్టీలు నిస్తేజంతో ఉన్నాయి.
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లు గులాబీ పార్టీకి మద్దతుగానే నిలుస్తున్నారు. గ్రేటర్ పరిధిలో 24 నియోజకవర్గాలు ఉండగా… గత రెండు పర్యాయాలు ప్రజలు బీఆర్ఎస్తో పాటు గులాబీ ఫ్రెండ్లీ పార్టీగా వస్తున్న మజ్లిస్కే పట్టం కడుతూ వస్తున్నారు. 2018 ఎన్నికల్లో 24 స్థానాలకుగాను కేవలం గోషామహల్ మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాలు ఈ రెండు పార్టీల ఖాతాలోనే పడ్డాయి. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ 24 నియోజకవర్గాల్లో 15 స్థానాలను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో రానున్న శాసనసభ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సోమవారం తొలి జాబితాను విడుదల చేశారు. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 స్థానాల్లో దాదాపు అన్ని స్థానాల్లోనూ సిట్టింగ్లకే మళ్లీ అవకాశం కల్పించారు. ఉప్పల్ నియోజకవర్గంలో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి స్థానంలో బండారి లక్ష్మారెడ్డిని రంగంలోకి దించుతున్నారు. గోషామహల్, నాంపల్లి నియోజకవర్గాలు పెండింగ్లో ఉన్నాయి. గ్రేటర్ పరిధిలోని స్థానాల్లో రెండు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో స్పష్టత రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఎన్నికల సమర శంఖానికి సిద్ధమయ్యాయి.
అభివృద్ధిలో ముందు.. ప్రజలతో మమేకం..
గ్రేటర్ పరిధిలో ఒకటి మినహా అన్ని స్థానాల్లో సిట్టింగ్లను బరిలో దించడమంటేనే ఎమ్మెల్యేల పనితీరు సంతృప్తికరంగా ఉందనేది రుజువైందని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందించడంతో పాటు మరోవైపు విశ్వ నగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్లో వేల కోట్లతో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను తమ నియోజకవర్గాల్లో పకడ్బందీగా జరిగేలా ఎమ్మెల్యేలు చొరవ చూపారని, తద్వారా నిత్యం ప్రజల్లో ఉండటంతో ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు మరోవైపు స్థానిక శాసనసభ్యులపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని విశ్లేషిస్తున్నారు. ఈ కారణంగానే బీఆర్ఎస్ అధిష్టానానికి సిట్టింగ్లను మార్చే అవసరం రాలేదని చెబుతున్నారు. కాగా ప్రజల్లో నిత్యం ఉంటున్న శాసనసభ్యులు కొంతకాలంగా ఆత్మీయ సమ్మేళనాలతో బీఆర్ఎస్ శ్రేణులతో మమేకమయ్యారు.దీంతో అన్ని నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ క్యాడర్ ఫుల్ జోష్లో ఉంది. సోమవారం మధ్యాహ్నం అభ్యర్థుల ప్రకటనతో గ్రేటర్వ్యాప్తంగా గులాబీ శ్రేణులు సంబురాలు జరుపుకున్నాయి.
అదే స్థానం నుంచి హ్యాట్రిక్ దిశగా..
ప్రస్తుతం గ్రేటర్ బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో ఆరుగురు అభ్యర్థులు వరుసగా అదే స్థానం నుంచి గెలిచి… మూడో పర్యాయం అంటే హ్యాట్రిక్ కోసం బరిలో నిలుస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సనత్నగర్ నుంచి, సికింద్రాబాద్ నుంచి టి.పద్మారావు, జూబ్లీహిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్, రాజేంద్రనగర్ నుంచి ప్రకాశ్గౌడ్, శేరిలింగంపల్లి నుంచి అరికెపూడి గాంధీ, కూకట్పల్లి నుంచి మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ నుంచి వివేకానంద్ వరుసగా అవే స్థానాల నుంచి రెండు సార్లు విజయం సాధించారు. ఈసారి హ్యాట్రిక్ విజయం కోసం ఉవ్విళ్లూరుతున్నారు. మరోవైపు మహేశ్వరం నుంచి మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత… ఇద్దరు మహిళలు గ్రేటర్ బరిలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు.
ప్రతిపక్షాలకు అభ్యర్థులేరీ?
బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటనతో ప్రతిపక్షాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. గ్రేటర్ పరిధిలో అటు కాంగ్రెస్గానీ ఇటు బీజేపీకిగానీ పోటీ చేసే అభ్యర్థులే కనిపించడం లేదు. కాగా సోమవారం అభ్యర్థుల ప్రకటన తర్వాత గ్రేటర్వ్యాప్తంగా గులాబీ సంబురాలే తప్ప ఏఒక్క చోట కాసింత కూడా అసంతృప్తి అనేది కనిపించలేదు.దీంతో ఇప్పుడు అభ్యర్థులు కరువై… ప్రతిపక్షాల పరిస్థితి అయోమయంగా తయారైంది.
తొలిసారిగా అసెంబ్లీ బరిలో ముగ్గురు..
బీఆర్ఎస్ ప్రకటించిన తొలి జాబితాలో గ్రేటర్ పరిధిలో ఇద్దరు అభ్యర్థులు తొలిసారిగా శాసనసభ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. కాకపోతే వీరిద్దరిదీ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే.కంటోన్మెంట్ స్థానం నుంచి దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందితను బీఆర్ఎస్ అధిష్టానం బరిలో నిలిపింది. అయితే సాయన్న రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని దోమలగూడ డివిజన్ (అప్పట్లో కవాడిగూడ కలుపుకొని) కార్పొరేటర్గా పోటీ చేసి, ఓటమి చెందారు. ఆ తర్వాత 1994లో కంటోన్మెంట్ నుంచి అసెంబ్లీ బరిలో నిలిచి గెలిచారు. ఆయన ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. లాస్య నందిత కూడా కవాడిగూడ కార్పొరేటర్గానే రాజకీయ అరంగేట్రం చేశారు. 2015లో గెలవగా, 2021లో ఓడిపోయారు. తండ్రి మరణంతో కంటోన్మెంట్ అసెంబ్లీ బరిలో నిలిచేందుకు బీఆర్ఎస్ అధిష్టానం అవకాశం కల్పించింది. కాగా మలక్పేట నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలుస్తున్న తీగల అజిత్రెడ్డి తొలిసారిగా అసెంబ్లీ బరిలో నిలుస్తున్నారు. దశాబ్దానికి పైగా రాజకీయాల్లో కొనసాగుతుండగా.. బ్యాలెట్ పోరులోకి దిగుతున్నారు. కార్వాన్ అభ్యర్థిగా ప్రకటించిన ఎ.కృష్ణయ్య (మిత్ర కృష్ణ) కూడా తొలిసారిగా అసెంబ్లీ బరిలో నిలుస్తున్నారు.
మేడ్చల్ జిల్లా
రంగారెడ్డి జిల్లా (జీహెచ్ఎంసీ పరిధి)
హైదరాబాద్ జిల్లా