హైదరాబాద్ : 2022-23 సంవత్సరంలో సమర్థవంతమైన ఇంధనం వినియోగం, విద్యుత్ పరిరక్షణ, పరిశోధన, ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించడం తదితర విభాగాల దక్షిణ మధ్య రైల్వే ఏడు అవార్డులను దక్కించుకుంది. రాష్ట్ర ఇంధన శాఖ, రాష్ట్ర రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఆర్ఈడీసీ) ఆధ్వర్యంలో 2023 సంవత్సరానికి గాను సంస్థ అవార్డులను ప్రకటించింది. తెలంగాణకు చెందిన ఐదు విభాగాలు, ఏపీకి చెందిన రెండు విభాగాలు అవార్డులు పొందాయి.
ఈ సందర్భంగా బుధవారం నగరంలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్, విశ్వేశ్వరయ్య భవన్లో అవార్డులు ప్రదానం కార్యక్రమం జరిగింది . రైల్వే స్టేషన్ భవనాల విభాగంలో నల్గొండ రైల్వే స్టేషన్కు గోల్డెన్ అవార్డు, ప్రభుత్వ భవనాల విభాగంలో లేక భవన్కు (ఎస్సీఆర్ ఆకౌంట్స్ ఆఫీస్ బిల్డింగ్) కు గోల్డెన్ అవార్డు, రైల్వే స్టేషన్ భవనాల విభాగంలో కాచిగూడ రైల్వే స్టేషన్కు సిల్వర్ అవార్డు పొందాయి. ప్రభుత్వ భవనాల విభాగంలో హైదరాబాద్లోని ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్సీ) భవనానికి సిల్వర్ అవార్డు, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ విభాగంలో లాలగూడలోని క్యారేజ్ వర్క్షాపుకు సిల్వర్ అవార్డును దక్కించుకున్నాయి.
ఏపీలో భవనాల విభాగంలో గుంతకల్ డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం భవనానికి గోల్డెన్, భవనాల విభాగంలో గుంటూరు డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం భవనానికి సిల్వర్ అవార్డును దక్కించుకున్నాయి. 2022-23 సంవత్సరంలో సమర్థవంతమైన ఇంధనం వినియోగం, విద్యుత్ పరిరక్షణ, పరిశోధన, ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించడం వంటి చర్యల ఫలితంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రంలో ఉన్న భవనాలు, స్టేషన్లకు అవార్డులు అందాయని రైల్వే అధికారులు తెలిపారు.