పటాన్చెరు, జూలై 10: అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో పెను ప్రమాదం తప్పింది. విధ్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే డ్రైవర్, సహాయకుడు అప్రమత్తమవడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు. గురువారం ఉదయం ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు చెందిన బస్సులోకి కిష్టారెడ్డిపేట వద్ద విద్యార్థులు ఎక్కుతున్నారు. ఈ క్రమంలో బస్సులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. గమనించిన డ్రైవర్ పిల్లలను వెంటనే బయటకు దింపేశారు. మంటలు వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.