ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 4 : కేంద్రప్రభుత్వం నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను కాపీ కొట్టి జాతీయ స్థాయిలో ప్రవేశపెడుతున్న ప్రధాని మోదీ కేసీఆర్ ప్రస్తుత ఆలోచనను మాత్రం ఎందుకు కాపీ కొట్టడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన సచివాలయ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టిందని గుర్తు చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12, 13 తేదీలలో మాదిగ జేఏసీ, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చాడు. చలో ఢిల్లీ కార్యక్రమ వాల్పోస్టర్ను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఎస్ఎఫ్ ఓయూ అధ్యక్షుడు బోరెల్లి సురేశ్ ,వివిధ సంఘాల నాయకులు ఆలేటి శ్రీశైలం, గాదె వెంకట్, మొగులయ్య, వేల్పుకొండ వెంకటేశ్, ప్రసాద్, సాయన్న, నరేశ్, గణేశ్, మహేశ్, శేఖర్, ప్రవీణ్, ధనరాజ్, రామకృష్ణ, రేవంత్, కిరణ్, చింటు, ముత్యాలు పాల్గొన్నారు.