సిటీబ్యూరో, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ అంటేనే కర్ఫ్యూ, బీజేపీ మతకల్లోల పార్టీ .. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్న ఈ రెండు పార్టీలను తరిమికొట్టాలని నగర మంత్రి, సనత్నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. తొమ్మిదిన్నరేండ్లలో కులాల పంచాయితీ పెట్టకుండా, మతం పేరిట మంటలు పెట్టకుండా.. ప్రాంతాల పేరుతో ఇబ్బందులు పెట్టకుండా బ్రహ్మాండంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా రూపుదిద్దడంలో ఒక్కొక్క అడుగు వేస్తూ పని చేస్తున్నామని చెప్పారు. మా ప్రభుత్వ పాలన ప్రజల కండ్ల ముందు ఉన్నదని, గత ప్రభుత్వాల పనితీరు కూడా గుర్తుంచుకుని ప్రజలు ఓటు వేయాలని కోరుతున్నామన్నారు. ఎన్నికలు రాగానే అబద్ధాలతో ప్రజలను గందరగోళంలోకి నెట్టేయడం, గొప్ప పాలనను అందిస్తున్న సీఎం కేసీఆర్పై అసత్య ఆరోపణలు చేస్తున్న పార్టీలు, ముఖ్యంగా హైదరాబాద్కి వచ్చే పొలిటికల్ టూరిస్ట్లు రాష్ర్టానికి, హైదరాబాద్కు ఏం చేశారో చెప్పి రావాలని తలసాని ప్రశ్నించారు.
హైదరాబాద్కి వచ్చే ప్రధాని మోదీకి ఈ తొమ్మిదిన్నరేండ్లలో ఏం చేశారో చెప్పాలని తలసాని డిమాండ్ చేశారు. మేం 36 ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులు పూర్తి చేస్తే రెండు ఫ్లై ఓవర్లు అంబర్పేట, ఉప్పల్లో ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పే ధైర్యం ఉందా? అని పేర్కొన్నారు. గ్యారంటీ లేని వాళ్లు గ్యారంటీ అంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. రాహుల్గాంధీ, సోనియాగాంధీలకు గ్యారంటీ లేకనే ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లిఖార్జున ఖర్గేను పెట్టారన్నారు. సీఎం కుర్చీ, పదవుల కోసం ఆరాటపడే కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మరని చెప్పారు. స్థిరమైన ప్రభుత్వం, దృఢమైన నాయకత్వంతో రాష్ట్రం దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని తలసాని అన్నారు. తెలంగాణలో ఉన్న గుడ్ గవర్నెన్స్ భారతదేశంలో ఎక్కడా లేదని, ఈ మంచి ప్రభుత్వాన్ని కాదని దొంగలకు తాళం చేతులు ఇస్తే ఇప్పుడున్న రాష్ట్రం సర్వనాశనం అవుతుందని, ప్రజలు విజ్ఞులు అని చెప్పారు. అభివృద్ధి, నిరంతరం పనితీరు కనబర్చాలన్నా బీఆర్ఎస్ను మరోసారి ఆశీర్వదించాలని కోరుతున్నట్లు తలసాని తెలిపారు. హైదరాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారం జరుగుతున్న తీరు, ప్రజల నుంచి వస్తున్న ఆదరణ, హైదరాబాద్కు వస్తున్న ప్రముఖులు, ఇతర అంశాలపై గురువారం మంత్రి తలసాని మాట్లాడారు.
ఎవరూ ఊహించని అభివృద్ధి..
50 సంవత్సరాలలో జరగని అభివృద్ధి గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో జరిగింది. ఒక్క సనత్నగర్లో ఎవరూ ఊహించని స్థాయిలో 1400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు జరిగాయి. గతంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఎంతో అస్తవ్యస్తంగా ఉండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో అనేక అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాం. నిరంతర విద్యుత్, సమృద్ధిగా తాగునీరు, ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ, ఎల్ఈడీ, డ్రైనేజీ వ్యవస్థ, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్, ఆధునిక మార్కెట్లు ఇలా చాలా అభివృద్ధి పనులు జరిగాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మున్ముందు కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారని, తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్నారు.
ప్రజలకు విశ్వాసం ఉంది
గ్రేటర్లో నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ మానస పుత్రిక డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కార్పొరేట్ స్థాయిలో లక్ష రెండు పడకల గదుల ఇండ్లను నిర్మించాం. ఇందులో 70వేల మంది లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేశాం. మరో 30 వేల ఇండ్ల పంపిణీ చేయాల్సి ఉండగా.. ఎన్నికల నోటిఫికేషన్తో ఆగిపోయింది. డబుల్ బెడ్రూం ఇండ్లు వచ్చిన వాళ్లు సంతోషంగా ఉన్నారు.. రానివారికి వస్తాయనే ధైర్యం ఇస్తున్నాం.. పేదలందరికీ న్యాయం జరిగేలా మరో లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టాం. దళితబంధు, మైనార్టీ, బీసీ బంధు తదితర పథకాలు దశలవారీగా ఇచ్చేవి.. ప్రజలు కూడా మాపై ఇదే స్థాయిలో విశ్వాసాన్ని పెట్టుకున్నారు. అయితే విపక్ష పార్టీలకు మాట్లాడేందుకు ఏం దొరకడం లేదు..కండ్ల ముందు డబుల్ బెడ్రూం ఇండ్లు కనబడుతున్నా వారు విచిత్రంగా మాట్లాడుతున్నారు. గతంలో ఇందిరమ్మ, జవహర్ హౌసింగ్ లాంటి ఇండ్లు 70 శాతం లబ్ధిదారులు, 30 శాతం సబ్సిడీ పేరుతో పేదలకు కేటాయించారు. అదో పుల్లల డప్ప మాదిరిగా, నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఇండ్లు ఇచ్చారు. కానీ మేం మాత్రం రూ. కోటి విలువజేసే ఇంటిని ఉచితంగా ఇచ్చాం. నెక్లెస్రోడ్ అంబేద్కర్ నగర్లో ఇచ్చిన ఇంటి విలువ కోటి రూపాయలు, మారేడ్పల్లిలో రూ.80 లక్షలు, కొల్లూరు కోటి రూపాయలు.. ఇలా విలువైన ఆస్తిని పేదలకు ఇచ్చాం. 58, 59 జీవోల కింద నా ఇల్లు అనే భరోసా కల్పించాం. మా పథకాలపై అవగాహన లేకుండా మాట్లాడే విపక్ష పార్టీల మూర్ఖులను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. వారు ఓటుతోనే సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.
భారీ మెజార్టీతో గెలుస్తున్నాం..
బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారానికి ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన వస్తోంది. తొమ్మిదిన్నరేండ్ల పాలన ప్రజల ముందు ఉంది.. కండ్ల ముందు అభివృద్ధి, ఇంటి ముందు అభ్యర్థి అంటూ చేస్తున్న ప్రచారానికి జనం నీరాజనం పలుకుతున్నారు. అన్ని వర్గాల మద్దతు లభిస్తున్నది. కాలనీలు, అసోసియేషన్లు, అభిమానులు స్వచ్ఛందంగా మా తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే రూ.400లకు వంట గ్యాస్ సిలిండర్, రేషన్పై సన్నబియ్యం పంపిణీ వంటి కార్యక్రమాలతో పాటు పేదల కోసం మరో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి పేదలకు పంపిణీ చేస్తామని చెబుతున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ వస్తది.. సంక్షేమ, అభివృద్ధి ఫలాలు సీఎం కేసీఆర్తోనే సాధ్యమంటూ ప్రజలు విశ్వాసం పెట్టుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. ముఖ్యంగా నేను నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తిని. ఏ చిన్న , పెద్ద సమస్య అయినా రెస్పాన్స్ అవుతా. అర్ధరాత్రి అయినా నా డోర్స్ ఓపెన్గా ఉంటాయి..శ్రీనన్నను కలిస్తే భరోసా దక్కుతుంది అనుకుంటున్నారు. అందుకే ఫ్యామిలీలో ఒకడిగా చూసుకుంటూ నా తరఫున ప్రచారం చేస్తున్నారు. అద్భుతమైన మెజార్టీతో సనత్నగర్లో హ్యాట్రిక్ సాధించబోతున్నా.
రాష్ర్టానికి సీఎం కేసీఆర్ శ్రీరామరక్ష
విజనరీ లీడర్ కేసీఆర్. ఈ రాష్ర్టానికి సీఎం కేసీఆర్ శ్రీరామరక్ష. ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి కావడం ప్రజల అదృష్టం. రాష్ట్రం సిద్ధించకముందు ఏ వర్గాలు ఎలా ఉన్నారు? యువత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాలను రంగరించి వారికి కావాల్సిన వసతుల కల్పనపై అధ్యయనం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల ఉద్యమ ట్యాగ్లైన్తో ఏర్పడిన తెలంగాణలో మానవ సమాజం బతకాలంటే కరెంట్, సాగు, తాగునీటిని బాగు చేసుకున్నాం. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ నూతన సచివాలయం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహం, జిల్లాకో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్, మెడికల్ కాలేజీలు ఇలా రాష్ట్ర అభివృద్ధికి గీటురాయిగా చెప్పొచ్చు. దేశంలో గొప్ప పాలన అందించిన ప్రభుత్వంపై ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. ప్రజలు బాగుండాలని కోరుకునే ఈ ప్రభుత్వాన్ని దూరం చేసుకునేందుకు సిద్ధంగా లేరు. కచ్చితంగా మళ్లీ అధికారంలోకి వస్తాం… మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపడతారు.
ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించండి
ఈ నెల 30వ తేదీన జరిగే పోలింగ్లో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ఆ రోజు హాలీడే ఉందని సినిమాకో, దేవాలయానికో పోతామనే ధోరణిని పక్కన పెట్టండి. ప్రజాస్వామ్య హక్కు.. ఓటు వినియోగం. ఓటు వేసినప్పుడే ప్రజా సమస్యలపై ప్రశ్నించే హక్కు ఉంటది. మనకు నచ్చిన ఎమ్మెల్యేను, ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా.