సిటీబ్యూరో, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ప్రీ లాంచ్ ఆఫర్తో అమాయకుల వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి, వందల కోట్లు మోసం చేసిన సాహితీ ఇన్ఫ్రా ఎండీ బూదాటి లక్ష్మీనారాయణను మూడురోజుల పోలీసు కస్టడీకి న్యాయస్థానం అనుమతిచ్చింది. అమీన్పూర్లోని 23 ఎకరాల్లో 38 అంతస్తుల్లో అపార్టుమెంట్లు నిర్మించి ఇస్తానంటూ 1700 మంది నుంచి రూ.539 కోట్లు వసూలు చేశాడు. ఈ కేసులో లక్ష్మీనారాయణతో పాటు పలువురిని నిందితుల జాబితాలో చేర్చారు. బూడాటి పార్వతి, సాత్విక్, సందు పూర్ణచందర్రావు, శ్రీనివాస్రావు కొడాలి, అంథోని రెడ్డి, ప్రహ్లాద్ త్యాహి, గోలమరి ఆకాశ్రెడ్డి, శశాంక్ సాగర్ సిద్ధం, రేవంత్కుమార్, రమేశ్, జ్యోతి బస్కోల్లిపార, భాస్కర్నాయకుడు, సందు శ్రీనివాస్, విజయ్కుమార్, విజయ్ బాబు, సనికొమ్ము శ్రీనివాస్రెడ్డి, శివరామ కృష్ణారెడ్డి, ప్రియాంక, వరద రామారావు, తోట క్రాంతికుమార్ తదితరుల పేర్లను లక్ష్మీనారాయణ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
ప్రధాన నిందితుడు లక్ష్మీనారాయణ అమీన్పూర్తో పాటు మాదాపూర్లో కార్తికేయ పనోరమా, నానక్రామ్గూడలో సాహితీ స్వాధ కమర్షియల్ కాంప్లెక్, మేడ్చల్లోని కొంపల్లిలో సిస్తా అడోవ్, గచ్చిబౌలిలో సాహితీస్ సితార కమర్షియల్ కాంప్లెక్స్, కొంపల్లిలో సాహితీస్ గ్రీన్ హోమ్స్, బంజారాహిల్స్లో మహెతో సెంట్రో, నిజాంపేటలో ఆనంద్ ఫార్చూన్, మోకిలాలో సాహితీ సుధీక్ష, కృతి బ్లోసమ్ తదితర ప్రాజెక్టుల పేర్లతో 2500 మంది నుంచి సుమారు రూ. 900 కోట్లు వసూలు చేసి, మోసాలకు పాల్పడినట్లు అభియోగాలున్నాయి. నిందితుడిని మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని సీసీఎస్ పోలీసులు విచారించనున్నారు. ఈ విచారణలో కొనుగోలు దారుల నుంచి సేకరించిన డబ్బు మళ్లింపుపై ఆరా తీయనున్నారు. అతడు ఇచ్చే సమాచారంతో మరికొంత మంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నదని పోలీసులు చెబుతున్నారు.