ఖైరతాబాద్, మే 25 : కార్మికుల భద్రత….ప్రజల బాధ్యతను గుర్తు చేస్తూ జలమండలి అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా పనిచేసే ప్రదేశాల్లో భద్రతా ప్రమాణాలపై జలమండలి రూపొందించిన ప్రతిజ్ఞ పత్రాలను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బుధవారం బంజారాహిల్స్లోని ఎన్బీటీనగర్లో ఆమె నివాసం వద్ద వాటర్ వర్క్స్ జీఎం హరిశంకర్, డీజీఎం శ్రీనివాస్, మేనేజర్లు మనోజ్ఞ, రాంబాబు, శ్రీహరి, శివకుమార్, పవన్తో కలిసి ఆవిష్కరించారు.
అనంతరం మేయర్ మాట్లాడుతూ నగరంలో మూడున్నర లక్షల మ్యాన్హోళ్లు ఉన్నాయని, మురుగునీటి క్రమబద్ధీకరణలో ఇవి దోహదపడుతున్నాయని చెప్పారు. పని చేసే ప్రతి కార్మికుడిని గౌరవించాలని, మ్యాన్హోళ్లలో కార్మికులు దిగకుండా జాగ్రతలు తీసుకోవాలని సూచించారు. జలమండలి జీఎం హరిశంకర్ మాట్లాడుతూ రోడ్లు, కాలనీలు, బస్తీల్లో గుండ్రపు ఆకారంలో మ్యాన్హోళ్లు తెరిచి ఉంటే.. వెంటనే జలమండలి టోల్ ఫ్రీ నం. 155313కి ఫిర్యాదు చేయవచ్చన్నారు.
భద్రతా వారోత్సవాలు షురూ..
నగరంతో పాటు ఓఆర్ఆర్ పరిధిలోని అన్ని జలమండలి డివిజన్లలో బుధవారం నుంచి భద్రతా వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. కార్మికుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జలమండలి ఎండీ దానకిశోర్ మాట్లాడుతూ విధుల్లో కార్మికులు, సిబ్బంది తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై, మ్యాన్ హోళ్ల విషయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంపూర్ణ అవగాహన కల్పించడం కోసం వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.