సిటీబ్యూరో, అక్టోబర్ 22(నమస్తే తెలంగాణ): సద్దుల బతుకమ్మ వేడుకలు నగరంలో అంగరంగ వైభవంగా జరిగాయి. కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు అన్నీ పూలవనంగా మారిపోయాయి. తీరొక్క పూలతో తయారు చేసిన బతుకమ్మలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిన్నారులు, మహిళలు, యువతులు ఆడిపాడి సందడి చేశారు. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..’ అనే పాటలు మార్మోగాయి. రంగురంగుల పూలను త్రీకోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ వలయంగా తిరుగుతూ బతుకమ్మలు ఆడి ఆకట్టుకున్నారు. ప్రధానంగా నగరంలోని చెరువుల వద్ద ప్రత్యేక సందడి కనిపించింది.
తెలంగాణ ప్రభుత్వం చెరువులను పునరుద్ధరించడంతో పాటు అక్కడ పర్యాటక హంగులు అద్దడంతో ఆ చుట్టు పరిసరాలన్నీ బతుకమ్మ ఆడేందుకు కేంద్రాలుగా నిలిచాయి. మరోవైపు నగరం నడిబొైడ్డెన ట్యాంక్బండ్ విభిన్న రకాల బతుకమ్మలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బతుకమ్మ కొలనుల వద్ద సిబ్బంది ఉండి బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేశారు. ఎవ్వరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు అమలు చేసిన ప్రణాళికలు విజయవంతమయ్యాయి. కాగా, నేడు దసరా పండుగ కావడంతో దేవాలయాలన్నీ వైభవంగా ముస్తాబయ్యాయి.
తెల్లవారు జాము నుంచే ఆలయాల వద్ద భక్తుల కిటకట షురూ అయ్యింది. ప్రత్యేక పూజలు చేసి భక్తులు ఆశీర్వాదం తీసుకుంటున్నారు. సాయంత్రం జమ్మి సంబురాలు చేసుకుని రావణ దహనం ప్రక్రియ పూర్తి చేస్తారు. ఈ క్రమంలో జమ్మి ఆకులను ఒకరికి ఒకరూ పంచుకొని ఆత్మీయ ఆలింగనాలు చేసుకుంటారు. కాలనీల్లో అందరూ ఒక చోట చేరి సంగీత కార్యక్రమాలు, నృత్యాలతో అలరించనున్నారు.