బడంగ్పేట, డిసెంబర్ 23: మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి మంచి నీళ్లు ఇచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్దేనని ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట్, బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత ప్రభుత్వం నిర్మించిన రిజర్వాయర్లను అధికారులతో కలిసి ఆమె సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితారెడ్డి మాట్లాడుతూ.. ఇంటింటికీ నల్లా నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగనని కేసీఆర్ చాలెంజ్ చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం, నీళ్లు ఇచ్చామన్నారు. గ్రామాల్లో ప్రతి రోజు మిషన్ భగీరథ పథకం ద్వారా మంచి నీళ్లు ఏ విధంగా ఇస్తున్నామో.. నగర శివారు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా మంచి నీళ్లు అందించాలని కేసీఆర్ అప్పట్లోనే నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు.
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న మున్సిపాలిటీలకు, మున్సిపల్ కార్పొరేషన్లకు మంచి నీటి సమస్య పరిష్కారం కావాలంటే మిషన్ భగీరథ పథకం ద్వారా ఇవ్వాలని ప్లాన్ చేశారని తెలిపారు. పైపులైన్లు వేయడానికి, రిజర్వాయర్లు నిర్మించడానికి గత ప్రభుత్వం హయాంలోనే రూ.1200 కోట్లు కేటాయించామన్నారు. మూడు దశలలో పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు గతంలోనే ఆదేశాలు జారీ చేశారని, ప్రణాళికా బద్ధంగా పనులు చేయించారని పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న మంచి నీటి సమస్యను పరిష్కరించడానికి రూ.280 కోట్లు మంజూరు చేశారని పేర్కొన్నారు.
మంజూరైన నిధులతో పైపులైన్ పనులు దాదాపుగా పూర్తి అయ్యాయని, రిజర్వాయర్ల పనులు చివరి దశకు వచ్చాయన్నారు. కొన్ని చోట్ల పనులు పూర్తి చేశామ ని చెప్పారు. పాత కాలనీల్లో తప్ప, మిగతా అన్ని కాలనీల్లో పైపులైన్లు వేశామని అన్నారు. రిజర్వాయర్ల పనులు పూర్తి అయ్యి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ సందర్భంలోనే ఎన్నికలు రావడంతో గత ప్రభుత్వం వాటిని ప్రారంభించ లేకపోయిందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తాము చేసినట్లు గొప్పలు చెప్పుకుంటూ డంబాచారంగా ప్రారంభోత్సవాలు చేసుకున్నారని ఆమె ఆరోపించారు. రిజర్వాయర్ల నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ పైసా ఖర్చు చేయలేదన్నారు.
నీటిని నిల్వ చేయడానికి వీలుండే విధంగా రిజర్వాయర్లను నిర్మించామని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. 50 ఏండ్ల వరకు నీటి సమస్య ఉత్పన్నం కాకుండా ఉండటానికి గత ప్రభుత్వం ప్రణాళికలు చేసిందని తెలిపారు. మహేశ్వరం నియోజక వర్గ వ్యాప్తం గా 19 రిజర్వాయర్లు నిర్మించినట్టు పేర్కొన్నారు. 29 ఎంఎల్డీ వాటర్ స్టోరేజీ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. బడంగ్పేట, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు తుక్కుగూడ, జల్పల్లి మున్సిపాలిటీలలో రిజర్వాయర్లను నిర్మించినట్టు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నీటి సమస్యే రాలేదన్నారు.
రిజర్వాయర్లు నిర్మించడానికి గతంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నామని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, కాలనీ వాసుల సహకారంతో రిజర్వాయర్లు నిర్మించామని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కమిషనర్ జ్ఞానేశ్వర్, డీఈ వెంకన్న, డీఈ జ్యోతి, వినల్ గౌడ్, కార్పొరేటర్లు ఏనుగు రాంరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామిడి రాంరెడ్డి, అర్కల కామేశ్ రెడ్డి, మర్రి నర్సిరెడ్డి, ఆనంద్ రెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
నిర్మించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పైసా ఖర్చు చేయలేదు. ప్రారంభించడానికి మాత్రం శిలా ఫలకాలు, బోర్డులు మాత్రం ఏర్పాటు చేశారు. కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మిషన్ భగీరథ పథకం గురించి తప్పుగా మాట్లాడే వారు రిజర్వాయర్లను మాత్రం ప్రారంభించడం విడ్డూరం. రిజర్వాయర్లు ప్రారంభించడమే కాదు, ప్రతి రోజు నీళ్లు కూడా ఇవ్వాలి. పైపులైన్లు వేయని పాత కాలనీలలో కొత్త పైపులైన్లు వేయించాలి.
– ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి