సిటీబ్యూరో, మే 1 (నమస్తే తెలంగాణ) : విస్తరిస్తున్న నగరానికి అనుగుణంగా శివార్లలో కొత్తగా సిటీ బస్సులను నడిపించడంపై ఆర్టీసీ అధికారులు దృష్టి సారించారు. ఎల్బీనగర్ నుంచి మియాపూర్, ఉప్పల్ నుంచి బీహెచ్ఈఎల్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వంటి మార్గాల్లో మెట్రో రైళ్లు తిరుగుతుండటంతో ఆయా మార్గంలో నడిచే సిటీ బస్సుల సంఖ్య తగ్గిస్తూ.. మెట్రో స్టేషన్లకు సిటీ బస్సుల కనెక్టివిటీని పెంచుతున్నారు. దీంతో గతంలో బస్సులు తిరుగని కాలనీలకు కొత్త బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే నగరానికి వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి 640 విద్యుత్ బస్సులు వస్తున్నాయని ఇప్పటికే ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.
ప్రస్తుతం నడుస్తున్న 640 పాత బస్సుల్లో దాదాపు 300 వరకు తుక్కు కింద తీసేస్తున్నారు. మిగిలిన 340 బస్సుల వరకు కండీషన్ను బట్టి సిటీ శివారు ప్రాంతాలకు తిప్పబోతున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. కాగా అన్ని కోణాల్లో సర్వే నిర్వహించి.. అవసరమైన ప్రాంతాల్లో బస్సులు నడిపించాలన్న లక్ష్యంతో అధికారులు చర్యలు తీసుకున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ. యాదగిరి, ప్రాంతీయ అధికారి సీహెచ్ వెంకన్న పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న కొత్త మార్గాల సర్వే ప్రక్రియ దాదాపు ఒకటి రెండు నెలల్లో పూర్తవుతుంది. ఆ తర్వాత జూన్ నుంచి వచ్చే మార్చి వరకు విడుతల వారీగా విద్యుత్ బస్సులు రానున్నాయి. ఈ లోగా రూట్ సర్వే పనులన్నీ పూర్తి చేస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.