సిటీబ్యూరో: గ్రేటర్లో సరిపడా బస్సు షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులు రోడ్లపై ఎండలోనే నిల్చోవాల్సి వస్తున్నది. సాధారణంగా గ్రేటర్లో 6 వేల బస్సులు అవసరముందని రవాణా రంగ నిపుణులు ఇప్పటికే ఆర్టీసీ ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించారు.
అయితే ప్రస్తుతం నగరంలో సుమారు 2800 బస్సులు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతీ రోజు 24 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. అయితే ప్రయాణికులకు సరిపడా బస్సు షెల్టర్లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదువుతున్నాయి. కేవలం వాణిజ్య ప్రకటనలు వచ్చే అవకాశం ఉన్న చోట మాత్రమే అధికారులు షెల్టర్ల ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం గ్రేటర్లో 1370 బస్షెల్టర్లు మాత్రమే ఉన్నాయి.
వీటి సంఖ్య పెంచాలని మరో 400కు పైగా కొత్త షెల్టర్లు నిర్మాణం అవసరం ఉందని ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యం భావించింది. ఉప్పల్, మెహిదీపట్నం, ఎల్బీనగర్, కోఠి, మియపూర్ సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో బస్ షెల్టర్లు అత్యవసరం. అందులో భాగంగా జీహెచ్ఎంసీ అధికారులకు ఆర్టీసీ విన్నవించింది. అత్యవసరంగా 120 షెల్టర్లు నిర్మాణం పూర్తి చేయాలని ఆర్టీసీ అధికారులు కోరారు. అత్యవసరంగా నిర్మించాల్సిన ఆ షెల్టర్లను కూడా జీహెచ్ఎంసీ విస్మరించిందని విమర్శలు వస్తున్నాయి.