సిటీబ్యూరో, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): అత్యాశకు వెళ్లి.. తెలియని వ్యక్తులు చెప్పిన మాటలు నమ్మితే అసలుకే మోసం వస్తుంది. ఇందుకు నారాయణగూడలో జరిగిన ఈ సంఘటనే నిదర్శనం. క్రిప్టో ట్రేడింగ్ పేరుతో నారాయణగూడకు చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థికి సైబర్ నేరగాళ్లు రూ.6 లక్షలు టోకరా వేశారు. తొలుత విద్యార్థి ఫోన్ నంబర్ను టెలిగ్రామ్ ట్రేడింగ్ గ్రూప్లో యాడ్ చేసిన వారు క్రిప్టో ట్రేడింగ్లో భారీ లాభాలు వస్తున్నాయంటూ ఆశ చూపారు.
అంతేగాక వచ్చిన లాభాల్లో 20 శాతం కమీషన్ ఇవ్వాలంటూ షరతు విధించారు. ఇందుకు ఒప్పుకున్న విద్యార్థి తొలుత రూ. 2 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత రూ.4 లక్షలు, మొత్తం రూ.6 లక్షలు పెట్టగా.. ఇందుకు రూ.36 లక్షల లాభం వచ్చినట్లు స్క్రీన్పై కనిపించేటట్లు చేశారు. ఆ డబ్బును డ్రా చేసుకోవడానికి అవకాశం లేకపోవడంతో విద్యార్థి నిర్వాహకులను ప్రశ్నించాడు. ముందుగా లాభాల్లో 20 శాతం కమీషన్ చెల్లిస్తే, డబ్బు డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తామని నేరగాళ్లు నమ్మించారు. వ్యవహారంలో తేడా కనిపించడంతో బాధితుడు ఇదంతా మోసమని గ్రహించి శుక్రవారం సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.