సిటీబ్యూరో, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ట్రై పోలీస్ కమిషనరేట్లలో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి రోజూ వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. సోమవారం ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో సోమవారం నిర్వహించిన తనిఖీలలో భారీగా నగదు, బంగారం, వెండి పట్టుబడింది. అదే తరహాలో మంగళవారం కూడా నగదు, బంగారం, వెండి ఆభరాలను పట్టుబడ్డాయి. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఈ తనిఖీలు కొనసాగాయి. శివారు ప్రాంతాలతో పాటు నగరంలోని ప్రధాన ప్రాంతాల్లోనూ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసుల నిఘాలో బంజారాహిల్స్లో భారీ ఎత్తున హవాల రాకెట్ గుట్టు బయటపడింది. కారులో తీసుకెళ్తున్న ఆధారాలు లేని సొమ్ము ఒకే చోట రూ. 3.35 కోట్లు పట్టుబడింది. బంజారాహిల్స్తో పాటు సికింద్రాబాద్, శంకర్పల్లి, ఇబ్రహీంపట్నం, అబిడ్స్, మెహిదీపట్నం, దిల్సుఖ్నగర్, బేగంపేట, అమీర్పేట్, కూకట్పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాలలో సోదాలు కొనసాగాయి. ప్రతి రోజు జరుగుతున్న ఈ సోదాలపై ఎన్నికల నిర్వహణ అధికారులతో పాటు పోలీస్ కమిషనర్లు సీవీ ఆనంద్, డీఎస్ చౌహాన్, స్టీఫెన్ రవీంద్ర పర్యవేక్షిస్తున్నారు.
ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో పౌరుల వద్ద రూ. 50 వేల కంటే ఎక్కువగా నగదు నిల్వ ఉండకూడదు. అంతకంటే ఎక్కువగా డబ్బు ఉంటే అందుకు సంబంధించిన పత్రాలు తప్పని సరిగా తమ వెంట ఉండాలి. అలా కాకుండా ఎక్కువ మొత్తంలో నగదుతో ప్రయాణాలు సాగిస్తే పోలీసుల తనిఖీలలో పట్టుబడే అవకాశం ఉంటుంది. పట్టుబడ్డ సొమ్మును పోలీసులు ఐటీ శాఖకు అప్పగిస్తారు. ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వస్తువులను భారీ ఎత్తున నాయకులు జమ చేస్తుంటారు. అలాంటివి ఎక్కడైనా ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింతే వెంటనే సోదాలు చేసి పట్టుకుంటారు. నాయకులను నమ్ముకొని ఎవరైనా ఇలాంటి వస్తువులు తమ ఇండ్లలో దాచిపెట్టినా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ఖరారు కావడంతో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. దీంతో ఎన్నికల నిర్వాహణకు సంబంధించిన నిఘా కొనసాగుతుంది. ఇందులో భాగంగా కేవలం పోలీసుల శాఖయే కాకుండా ఎన్నికల నిర్వహణ అధికారుల నిఘా సైతం కొనసాగుతున్నది.
మెహిదీపట్నం : ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెహిదీపట్నం మెరాజ్ చౌరస్తాలో స్కూటీలో తీసుకువెళ్తున్న రూ.6 లక్షల నగదును పట్టుకున్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని డీసీపీ కిరణ్ ఖరె ప్రభాకర్ హెచ్చరించారు.
చాదర్ఘాట్ : మలక్పేట ఫైర్ స్టేషన్ రోడ్డులో చాదర్ఘాట్ పోలీసులు తనిఖీ చేస్తుండగా అక్రమంగా తరలిస్తున్న దాదాపు రూ.2.30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
బేగంపేట : మహంకాళి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఎలాంటి ఆధారాలు, రశీదులు లేని రూ.32.50 లక్షల నగదు, 706 గ్రాముల బంగారం, 3.4 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఐటీ శాఖకు అప్పగించినట్టు ఇన్స్పెక్టర్ పరశురాం తెలిపారు.
శామీర్పేట : శామీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలోని లింగాపూర్లో ఏర్పాటు చేసిన అంతర్ జిల్లా చెక్పోస్టు వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించగా.. రూ89,500లు పట్టుబడ్డాయి.
పీర్జాదిగూడ : మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచర్ల ఐవోసీఎల్ గ్యాస్ గోడాన్ సమీపంలో మంగళవారం మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు, మేడిపల్లి పోలీసుల ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. సికింద్రాబాద్కు చెందిన ఓ వ్యక్తి కారులో రూ. 6,01,940 తరలిస్తూ పట్టుబడ్డాడు.
గోల్నాక : అంబర్పేట ప్రధాన రహదారి విశాల్ మార్ట్ చెక్ పోస్ట్ మీదుగా బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి అంబర్పేట పోలీసులు రూ.2.25 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
ఖైరతాబాద్ : పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ముసద్దీలాల్ జూవెల్లర్స్ వద్ద మంగళవారం
ఓ మహిళ వద్ద నుంచి పోలీసులు రూ. ఐదు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
వెంగళరావునగర్: ఎస్ఆర్ నగర్ పోలీసులు మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన తనిఖీల్లో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ యువకుడి వద్ద నుంచి రూ. 15 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
కవాడిగూడ : దోమలగూడ పోలీసులు మంగళవారం రాత్రి నారాయణగూడ వై జంక్షన్లో నిర్వహించిన తనిఖీల్లో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ యువకుడి నుంచి రూ. ఆరు లక్షలు స్వాధీనం చేసుకున్నారు.