Hyderabad | సిటీబ్యూరో, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ) : కాలుష్య రహిత వాహనాలకు స్వస్తి చెప్పి.. పర్యావరణ హిత వాహనాలకు ప్రభుత్వం జై కొడుతున్నది. ఆ ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ మహానగరంలో డీజిల్ వాహనాలను క్రమక్రమంగా తగ్గిస్తూ విద్యుత్తో నడిచే వాటిని ప్రవేశ పెట్టేందుకు సమాయత్తమవుతున్నది. వచ్చే రెండేండ్లలో ఆర్టీసీలోని పాత డీజిల్ బస్సులను శాశ్వతంగా తొలగించి వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో 860 బస్సులను నగర రోడ్లపై తిప్పనున్నారు. ఇందులో 500 సిటీ, 50 ఇంటర్ సిటీ, 10 డబుల్ డెక్కర్ బస్సులకు ఆమోదం తెలిపిన ఆర్టీసీ అధికారులు.. మరో 300 బస్సులకు టెండర్ల ప్రక్రియను కొనసాగిస్తున్నారు. అంతేకాక బస్సులను చార్జింగ్ చేసేందుకు అన్ని డిపోల్లో స్టేషన్లను నెలకొల్పేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
ప్రయాణికుల సంక్షేమమే ధ్యేయంగా సరికొత్త పద్ధతులను అనుసరిస్తూ టీఎస్ ఆర్టీసీ ప్రగతి చక్రం దూసుకెళ్తున్నది. ప్రయాణికులకు సుఖమైన ప్రయాణాన్ని అందించడం కోసం కాలుష్యానికి చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. నగరంలో కాలుష్య రహిత వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటికే విద్యుత్ వాహనాలు నగరంలో రోజుకు రోజుకు పెరుగుతున్నాయి. అందులో భాగంగా ఆర్టీసీ అధికారులు కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు.
వచ్చే రెండు సంవత్సరాల్లో నగరంలో డీజిల్తో నడిచే సిటీ బస్సులకు శాశ్వతంగా స్వస్తి పలుకబోతున్నారు. నగరంలో ఇక మొత్తం విద్యుత్ బస్సులే తిప్పుబోతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే దాదాపు 860 బస్సులు ఒకటి, రెండు నెలల్లో నగర రోడ్లపై తీరుగబోతున్నాయి. ఈ మేరకు టెండర్ల ప్రక్రియ పూర్తికావొచ్చింది. ఈ బస్సుల్లో ప్రస్తుతం 10 డబుల్ డెక్కర్ బస్సులు కూడా ఉన్నాయి. వీటికి తోడుగా 50 ఇంటర్ సిటీ విద్యుత్ బస్సులను నడుపబోతున్నారు. అలాగే మరో 500 విద్యుత్ బస్సులు సైతం వస్తున్నాయని అర్టీసీ గ్రేటర్ జోన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఈ యాదగిరి తెలిపారు. అయితే ప్రస్తుతం సిటీలో తిరుగుతున్న 500 బస్సుల కాలం చెల్లింది. పైగా ఆ బస్సులన్నీ కూడా డీజిల్వే కావడం వల్ల కాలుష్యం కూడా పెరుగుతున్నది. దీంతో వాటి స్థానంలో విద్యుత్ బస్సులు నడుపనున్నారు. ఇదిలా ఉంటే మరో 300 విద్యుత్ బస్సులు కూడా త్వరలోనే సిటీకి రాబోతున్నాయన్నారు. ఈ క్రమంలో ఒకటి లేదా రెండు రోజుల్లో 50 శాతం వరకు విద్యుత్ బస్సులే తిరుగబోతున్నాయి. ఈ మేరకు నగరంలో వాయు కాలుష్యం తగ్గడానికి తమ వంతు కృషి చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
డిజిల్ బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులు తీసుకురావడం వల్ల ఆర్టీసీపై పడే ఆర్థిక భారం బాగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. పైగా విద్యుత్ బస్సుల వల్ల కిలో మీటర్కు రూ.13 మిగులుతుందని చెబుతున్నారు. కిలోమీటర్కు విద్యుత్ బిల్లులు రూ.7 ఖర్చు వస్తుందని, అదే డీజిల్ ఖర్చు మాత్రం రూ.20 గా ఉంటుంని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో రూ.13 ఆదా అవుతుందన్నారు. అయితే డీజిల్ బస్సులతో పోల్చితే.. విద్యుత్ బస్సు ఖరీదు అధికంగా ఉన్నప్పటికీ.. నిర్వహణ ఖర్చులు బాగా తగ్గుతున్నాయని అంచనా వేసిన తర్వాతే విద్యుత్ బస్సుల వైపు ఆర్టీసీ అధికారులు మొగ్గు చూపినట్లు తెలుస్తున్నది.
రానున్న రెండు సంవత్సరాలలో నగరంలో అన్ని బస్సు డిపోల పరిధిలో విద్యుత్ బస్సులు తిరుగుతాయి. దీంతో అన్ని డిపోల్లో ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు రాబట్టడం కోసం ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం చెంగిచెర్ల, కాచిగూడ, బర్కత్పుర, మెహిదీపట్నం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వంటి పలు డిపోల పరిధిలో ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.