తెలుగుయూనివర్సిటీ, ఆగస్టు 11: రైళ్లలో మహిళా ప్రయాణికులను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ముఠాను నాంపల్లి రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ ఎ. శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హాఫీజ్పేట్ రైల్వే స్టేషన్ ఆవరణలో ఆర్పీఎఫ్ బలగాలు గురువారం ఉదయం తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆదుపులోకి తీసుకొని విచారించారు. వీరు ఎర్రగడ్డకు చెందిన పూజారి సతీశ్ (20), యాదగిరి (25) చందానగర్ పాపిరెడ్డి కాలనీకి చెందిన డి. రాజుతో కలిసి మార్బుల్ స్టోన్ పనులు చేస్తున్నారు.
ఈ ముగ్గురు ఓ ముఠాగా ఏర్పడి గత కొంత కాలంగా రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్న ఓ ముఠా.. మహిళల మెడలోని బంగారు గొలుసులను చాకచక్యంగా లాక్కొని.. వాటిని విక్రయించి అవసరాలను తీర్చుకుంటున్నట్లు విచారణలో వెల్లడైంది. సతీశ్, యాదగిరిని విచారించగా హైదరాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో 5 కేసులు, మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు కేసులతో వీరికి సంబంధం ఉన్నట్లుగా తేలింది. మరోనిందితుడు రాజు పరారీలో ఉన్నాడు. పట్టుబడిన ఇద్దరి నుంచి 14తులాల బంగారం, రూ. 7 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.