బంజారాహిల్స్, జూన్ 20: కోర్టు ఆదేశాలు ఉన్నాయని నమ్మిస్తూ.. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి వేసిన బ్లూషీట్లను షేక్పేట మండల రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ పక్కన షేక్పేట మండలం సర్వే నెంబర్ 403లోకి వచ్చే టీఎస్ నెంబర్ 5, బ్లాక్ హెచ్, వార్డు 10లో సుమారు 2వేల గజాల ఖాళీ ప్రభుత్వ స్థలం ఉంది. గతంలోనే రెవెన్యూ అధికారులు ఈ స్థలంలో ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.
కాగా ఈ స్థలం సర్వే నెంబర్ 129/104(ఓల్డ్)(403/53న్యూ)లోకి వస్తుందని, 1000 గజాల స్థలం తమదని, షేక్పేట రెవెన్యూ అధికారులు తమ స్థలంలో పనులు చేసుకోనివ్వడం లేదంటూ పవన్ కుమార్ (Pavan Kumar) అనే వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు పొందారు. ఈనెల 15న ఆదివారం కావడంతో భారీ ఎత్తున ప్రైవేటు వ్యక్తులతో వచ్చి స్థలం చుట్టూ బ్లూషీట్లు వేసుకున్నారు. స్థలంలో ఉన్న ప్రభుత్వ హెచ్చరిక బోర్డును తీసి పక్కన పాతారు. ఈ వ్యవహారాన్ని నమస్తే తెలంగాణ పత్రికలో ‘ఖరీదైన ప్రభుత్వ స్థలం ఆక్రమణ’ పేరుతో సోమవారం కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే.
జేసీబీ సాయంతో బ్లూషీట్ల తొలగింపు
ఆ కథనంపై స్పందించిన జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు సమగ్రమైన విచారణ చేయాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన షేక్పేట మండల తహసీల్దార్ ప్రభుత్వ స్థలంగా రెవెన్యూ రికార్డుల్లో ఉన్న ప్రదేశంలోకి నాన్ ఎగ్జిస్టింగ్ సర్వే నెంబర్ 129/104(ఓల్డ్)(403/53న్యూ) పేరుతో వచ్చి వేసిన బ్లూషీట్లను తొలగించాలంటూ స్పీకింగ్ ఆర్డర్స్ జారీ చేశారు.
దాంతో, శుక్రవారం ఉదయం షేక్పేట ఆర్ఐ అనిరుధ్, వీఆర్వో శ్రీనివాసరెడ్డి, స్పెషల్ ఆర్ఐ భానుచందర్ ఆధ్వర్యంలో జేసీబీ సాయంతో 1000 గజాల ప్రభుత్వ స్థలంలో వెలిసిన ఆక్రమణలను నేలమట్టం చేయడంతో పాటు ప్రభుత్వ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ స్థలం ప్రభుత్వానిదే అని, ప్రైవేటు వ్యక్తులు ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని షేక్పేట తహసీల్దార్ అనితా రెడ్డి తెలిపారు. ఈ స్థలం విలువ సుమారు రూ. 30కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.