Bigg Boss | జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి సత్యశ్రీ ప్రస్తుతం సినిమాల్లో వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు. టెలివిజన్కు దూరంగా ఉంటూ వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న ఆమె, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, కెరీర్ ఎంపికలు, అలాగే బిగ్బాస్ ఆఫర్ను ఎందుకు తిరస్కరించారనే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జబర్దస్త్ తర్వాత సినిమాల్లో మంచి అవకాశాలు రావడంతో టెలివిజన్లో తక్కువగా కనిపిస్తున్నానని సత్యశ్రీ తెలిపారు. కెరీర్ ప్రారంభంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని స్వీకరించినప్పటికీ, ఇప్పుడు మాత్రం పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నానని చెప్పారు.
ఇప్పుడు నేను ఉన్న దశలో నా ఇమేజ్, రెప్యుటేషన్ను దృష్టిలో పెట్టుకుని పాత్రలు ఎంచుకుంటున్నాను. గ్లామర్ ఉన్నంతవరకు మంచి అవకాశాలను సెలెక్టివ్గా చేయాలనుకుంటున్నాను అని ఆమె పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన ‘అనగనగా ఒక రాజు’ చిత్రంలో నటించిన సత్యశ్రీ, హీరో నవీన్ పొలిశెట్టి గురించి కూడా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సెట్స్లో నవీన్ ఎప్పుడూ పనిపైనే దృష్టి పెట్టే వ్యక్తి అని, ప్రతి క్షణం సినిమా గురించే ఆలోచిస్తుంటారని చెప్పారు. నవీన్ గారితో మాట్లాడింది చాలా తక్కువ. కానీ ఆయన పని చేసే విధానాన్ని దగ్గరగా చూసే అవకాశం వచ్చింది. ‘జాతిరత్నాలు’ సమయంలోనే మరో సినిమాలో కలిసి పని చేద్దామని ఆయన చెప్పారు. ఆ మాటను నిలబెట్టుకుని ‘అనగనగా ఒక రాజు’లో అవకాశం ఇవ్వడం నాకు చాలా ఆనందంగా అనిపించింది” అని సత్యశ్రీ తెలిపారు.
ఇటీవల బిగ్బాస్ తెలుగు సీజన్-10 కోసం సత్యశ్రీకి ఆఫర్ వచ్చిందనే వార్తలపై కూడా ఆమె స్పందించారు. ఆ వార్తల్లో నిజం ఉందని, కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు.నాకు బిగ్బాస్ నుంచి ఆఫర్ వచ్చింది. కానీ నేను మా కుటుంబ బాధ్యతలను చూసుకుంటున్నాను. అమ్మానాన్నలను అంతకాలం వదిలి వెళ్లడం నాకు సాధ్యం కాదు. వారికి తోడుగా ఉండాల్సిన బాధ్యత నాదే. అందుకే ఆ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించాను అని ఆమె చెప్పారు. ప్రతి ఒక్కరికీ కుటుంబం ఉంటుందని, కానీ చాలామందికి వారి బాధ్యతలు పంచుకునే వారు ఉంటారని, తన పరిస్థితి మాత్రం భిన్నమని సత్యశ్రీ వివరించారు. అందుకే కెరీర్ కంటే కుటుంబానికే ప్రాధాన్యం ఇచ్చానని స్పష్టం చేశారు.