కంటోన్మెంట్, మార్చి 19: అంతన్నారు..ఇంతన్నారే కేంద్ర ప్రభుత్వం…..బోర్డు ఎన్నికల నోటిఫికేషన్ అన్నారే కేంద్ర సర్కారు……తిరిగి నెల రోజులు కాకముందే ఎన్నికలు రద్దు అంటూ నట్టేటా ఒగ్గేశారే కాషాయ సర్కారు అన్న చందంగా మారింది…కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరు. దేశంలోని 57 కంటోన్మెంట్ బోర్డులకు ఎన్నికలు నిర్వహించే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన తరువాత తిరిగి నెల రోజుల వ్యవధిలోనే ఎన్నికలు నిర్వహించలేమంటూ రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంపై సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాసులు కేంద్ర సర్కారు తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. సుమారు మూడేళ్లుగా బోర్డుకు ఎన్నికలను నిర్వహించకుండా కొత్త యాక్టు తీసుకొస్తామంటూ మీనమేషాలు లెక్కిస్తున్న మోదీ సర్కారు పార్లమెంట్లో బిల్లు పెడుతూ ఆమోదించకుండా చోద్యం చూస్తుంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 17న నూతన యాక్టుతో పాటు విలీన ప్రక్రియను సైతం వెనక్కి నెట్టి ఎన్నికలకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గెజిట్ ప్రకారం ఈ నెల 28, 29 తేదీల్లో నామినేషన్లు, వచ్చే నెల 30న ఎన్నికల పోలింగ్ నిర్వహణ అంటూ కంటోన్మెంట్ బోర్డు అధికారులు షెడ్యూల్ను ప్రకటించారు. కానీ సరిగ్గా నెల రోజుల అనంతరం అంటే మార్చి 17న మరోమారు డిఫెన్స్ శాఖ గెజిట్ విడుదల చేస్తూ ఎన్నికలను జనరల్ క్లాసెస్ యాక్టు-1897 ద్వారా ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరగవు అని తెలుసుకున్న కంటోన్మెంట్ వాసులు కేంద్ర ంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికలను నిర్వహించకుండా కంటోన్మెంట్ ప్రజల హక్కులను రక్షణ శాఖ కాలరాస్తుందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. సహేతుకంగా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించిన తరువాత రద్దు చేయడమంటే బలమైన కారణం ఉండాలి. కానీ చట్టంలోని లోసుగులను ఆసరాగా చేసుకుని ఎన్నికలను నిలుపుదల చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు నిర్వహిస్తే కేంద్రంలోని బీజేపీకి ప్రజల మద్దతు లేదని ముందే తెలిసిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే బీజేపీ ఓటమిపాలైతే ఇతర రాష్ర్టాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపుతుందన్న భయంతో ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచే ఎన్నికల రద్దుకు సంబంధించిన ఆదేశాలు అందాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఒక్క సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న మరో 56 కంటోన్మెంట్ ప్రాంతాల్లో బీజేపీ పరిస్థితి తలకిందులుగా మారింది. ఈ క్రమంలో ఎన్నికలు నిర్వహిస్తే దీని ప్రభావం వచ్చే ఏడాదిలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలపై పడుతుందన్న భయంతో ఆకస్మాత్తుగా ఎన్నికలను రద్దు చేయడం జరిగిందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తుగ్లక్ పాలనకంటే హీనంగా కేంద్రంలో పరిపాలన సాగిస్తున్న కమలనాథులకు రానున్న రోజుల్లో ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికలను పునప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు కోర్టు తలుపు తట్టనున్నారు. నేడు హైకోర్టులో కంటోన్మెంట్ ఎన్నికల నిర్వహణను కొనసాగించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి కోర్టు మెట్టికాయల ద్వారనైనా కేంద్రం దిగి వస్తుందో లేదో వేచి చూడాల్సిందే…!
కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో ఓటమి పాలవుతామనే భయంతోనే ఎన్నికలను రద్దు చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన నెలరోజుల్లోనే ఫలితాలు తెలియడంతోనే ఎన్నికలకు వెళ్లకుండా రద్దు చేయించారు. ప్రజల తీర్పును ముందే గ్రహించిన కమలనాథులు ఎలాంటి కారణం చెప్పకుండానే ఎన్నికలకు బ్రేక్లు వేశారు. దేశవ్యాప్తంగా 57 కంటోన్మెంట్ బోర్డులలో కాషాయ పార్టీకి చెందిన వాళ్లే నామినేటెడ్ సభ్యులుగా ఉండడంతో ఇదే పద్ధ్దతిని కొనసాగించేందుకు కుట్రలకు తెరలేపినట్లు తెలుస్తోంది. రాచరిక పాలన మాదిరిగా బీజేపీ సర్కారు ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తుందని దుయ్యబట్టారు. ఎన్నికలు నిర్వహించేలా బీఆర్ఎస్ పార్టీ తరపున కోర్టును ఆశ్రయిస్తున్నట్లు పేర్కొన్నారు.
– మర్రి రాజశేఖర్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి, మల్కాజిగిరి పార్లమెంట్