సిటీబ్యూరో, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): మెట్రో విస్తరణ మార్గాలపై మంగళవారం బేగంపేట మెట్రో రైలు భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ మెట్రో రైలు ఎం.డీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలపై గత 20 ఏళ్లుగా ఆయనకు ఉన్న అనుభవాన్ని, హైదరాబాద్ నగర ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా మెట్రో రావడానికి దారితీసిన విధానాన్ని ప్రత్యేకంగా వెల్లడించారు. 2002లో అప్పటి ఎంసీహెచ్(ప్రస్తుత జీహెచ్ఎంసీ) అడిషనల్ కమిషనర్ (ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్టేషన్)గా, ఎంఎంటీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్గా పనిచేశా. ఎంఎంటీఎస్ ప్రాజెక్టును సుమారు రూ.200 కోట్లతో పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలను ఎలా పరిష్కరించాలని ఆలోచన మొదలు పెట్టా.
ఒక్క ఆలోచన నగరాన్ని మార్చేసింది
ఒక్క ఆలోచన నగరాన్ని మార్చివేసేలా ఉంటుందన్నది నా అభిప్రాయం. అప్పటి నుంచి నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రకరకాలుగా ఆలోచిస్తూ వచ్చా. సౌత్ అమెరికన్ దేశాలలో కొలంబియా, బొగతా నగరాల్లో వారు బీఆర్టీఎస్ అనే బ్రహ్మండమైన ప్రాజెక్టు చేపట్టారు. రోడ్డు లెవల్లోనే ప్రత్యేకంగా బస్ లేన్లు పెట్టి బస్సులను నడిపారు. దాన్ని చూసి చాలా ప్రభావితం అయ్యా. దాన్ని అధ్యయనం చేసిన తర్వాత వారిని ఇక్కడకు తీసుకువచ్చి హైదరాబాద్లో బీఆర్టీఎస్ ప్రాజెక్టు చేద్దాం అని చెప్పా. ఆ సమయంలో డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి సీ.ఎంగా ఉన్నారు. బొగతా నగర మేయర్ను తీసుకువచ్చి సీఎంతో కలిపించా. ఈ ప్రాజెక్టును చేద్దామని మేము దీనిపై 6 నెలల పాటు వర్క్ చేశాం. ఆ తర్వాత హైదరాబాద్ రోడ్లలో ఈ ప్రాజెక్టు సాధ్యం కాదని చెప్పారు.
వైఎస్ఆర్… వృథా ఖర్చు అన్నారు..!
అదే సమయంలో ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తుంటే మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టాలన్న ఆలోచన కలిగింది. వెంటనే జీహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్న ఎస్.పీ.సింగ్తో కలిసి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ని ఒప్పించి, మెట్రో ప్రతిపాదన తీసుకువచ్చాం. 2007-08లో ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో రైలు మార్గాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పగా.. ఇదంతా వృథా ఖర్చు ఎందుకని తిరస్కరించారు. కానీ ఇప్పుడు అదే ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేందుకు ఎంతో దూరదృష్టి కలిగిన సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన ఆదేశాలకు అనుగుణంగానే ఓఆర్ఆర్ చుట్టూ మొత్తం 156 కి.మీ మేర మెట్రో మార్గాన్ని నిర్మించాలని ప్రతిపాదనలు రూపొందించాం. దీనికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఓఆర్ఆర్ అవతల అభివృద్ధి జరగాలని..
నగరంలో ప్రజలకు అవసరమైన వాటిలో అతి ముఖ్యమైనది మంచినీరు. దాన్ని సీఎం కేసీఆర్ 50 ఏళ్ల వరకు ఇబ్బందులు లేకుండా కల్పించారు. ఆ తర్వాత ట్రాఫిక్ సమస్య. దాన్ని పరిష్కారం కోసం ముఖ్యమంత్రి ఎంతో కసరత్తు చేశారు. దేశంలోని మెట్రో నగరాల్లో ఉన్నట్లుగా ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలని, అందుకోసం మెట్రోను ఎంత దూరమైనా నిర్మించాలని సూచించారు. ముఖ్యంగా ఔటర్ రింగు రోడ్డు వెంబడి ఉన్న టౌన్షిప్లను అభివృద్ధి చేయడం ద్వారా నగర వాసులు శివారు ప్రాంతాల్లో నివాసముంటారు. అక్కడి నుంచి రాకపోకలు సాగించేందుకు మెట్రో అత్యంత అనుకూలంగా ఉంటుందని సూచించడంతో హైదరాబాద్ నగరానికి సంబంధించి భవిష్యత్ ప్రజా రవాణా వ్యవస్థగా మెట్రోను భారీ ఎత్తున విస్తరించేలా ప్రణాళికలు రూపొందించాం.
సీఎం కేసీఆర్ విజన్తోనే..
హైదరాబాద్ మహానగరం అభివృద్ధిపై సీఎం కేసీఆర్కు అపారమైన నమ్మకం, దూరదృష్టి ఉంది. నగరాన్ని దేశ స్థాయిలో కాకుండా ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దాలని ఆయన కోరిక. దానికి అనుగుణంగా ఎన్నో ప్రాజెక్టులను తీసుకు వస్తున్నారు. అలాగే మెట్రో రైలు మార్గాలను నగరం నలుమూలలా విస్తరించాలని తమకు సూచించారు. దానికి అనుగుణంగానే మెట్రోను ఔటర్ రింగు రోడ్డు చుట్టూ నిర్మించడంతో పాటు ఔటర్ దాటిన తర్వాత ఉన్న ప్రాంతాలకు విస్తరిస్తూ కొత్త మార్గాలను నిర్ణయించాం.
415 కి.మీ మెట్రో మార్గం..
మొదటి దశలో చేపట్టిన 69 కి.మీ మెట్రో మార్గంతో నగరంలో చాలా వరకు ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం లభించింది. అదే తరహాలో మరిన్ని మార్గాల్లో మెట్రోను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మెట్రో ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఒకవేళ కేంద్రం నుంచి ఆర్థిక సాయం రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే ప్రతిపాదించిన మెట్రో మార్గాలను ప్రాధాన్యతా క్రమంలో చేపడుతామని మంత్రి కేటీఆర్ సైతం వెల్లడించారన్నారు.
రూ.69 వేల కోట్లతో..
ప్రభుత్వం ఆదేశించినట్లుగా మెట్రో మార్గాలను నగరంలో నలుమూలలా విస్తరించేందుకు ఆ మార్గాల్లో అధ్యయనం చేయడంతో పాటు డీపీఆర్లను సిద్ధం చేస్తామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మొత్తం 415 కి.మీ మెట్రో మార్గాన్ని హైదరాబాద్ నలుమూలలా నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇందుకోసం సుమారు రూ.69100 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
ఇంటర్చేంజ్ల వద్ద 5-10 ఎకరాల్లో పార్కింగ్
తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చే వారు ఔటర్ రింగు రోడ్డు ఇంటర్చేంజ్ల నుంచి తమ గమ్య స్థానాలకు వెళ్లేలా మెట్రో మార్గాలు అందుబాటులో ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. గ్రేటర్ చుట్టూ ప్రస్తుతం 158 కి.మీ పొడవుతో ఉన్న ఓఆర్ఆర్ చుట్టూ మొత్తం 156 కి.మీ మేర మెట్రో మార్గం వస్తుంది. ఇంటర్చేంజ్ల వద్ద 5 నుంచి 10 ఎకరాల స్థలాన్ని సేకరించి పార్కింగ్ కోసం అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. దానికి అనుగుణంగానే ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ల వద్ద మెట్రో స్టేషన్లను నిర్మిస్తున్నాం.
16 ఏళ్ల కిందట ఔటర్
రింగు రోడ్డు నిర్మాణ సమయంలోనే దాని వెంట మెట్రోను ఏర్పాటు చేయాలని, అప్పటి అధికారుల బృందంతో కలిసి సీఎం వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాం. ఆయన దాన్ని వద్దని తిరస్కరించారు. ఆ సమయంలోనే ఓఆర్ఆర్ లోపలి వైపు రైల్వే కారిడార్ కోసం 25 మీటర్ల వెడల్పుతో కూడిన స్థలాన్ని సేకరించి ఉంచాం. ఇప్పుడు అదే స్థలంలో ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో రైలు నిర్మాణానికి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
-ఎన్వీఎస్ రెడ్డి, హైదరాబాద్ మెట్రో రైలు ఎం.డీ