గుండ్లపోచంపల్లిలో 80 , మేడ్చల్లో 85 శాతం వసూళ్లు..
శ్రమిస్తున్న అధికారులు, సిబ్బంది
మేడ్చల్ రూరల్, మార్చి 27 : ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో మేడ్చల్, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీల అధికారులు, సిబ్బంది పన్ను వసూళ్లను ముమ్మరం చేశారు. పాలకవర్గం 100 శాతం పన్ను వసూలే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారు. ఆదివారం సైతం లక్ష్య సాధనకు శ్రమిస్తున్నారు. మొండిగా వ్యవహరించే వారి వద్దకు అధికారులు, సిబ్బంది మూకుమ్మడిగా కలిసి వెళ్లడం చేస్తున్నారు. ఎక్కువ మొత్తంలో బకాయిలు ఉంటే చైర్పర్సన్లు కూడా వెళ్లి పన్నులు వసూలుకు కృషి చేస్తున్నారు.
రూ.15 కోట్లకు చేరువలో…
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో రూ.10.23 కోట్ల పన్ను వసూలు డిమాండ్ ఉండగా శనివారం దాదాపు రూ.8 కోట్ల వరకు పన్ను వసూలు చేశారు. ఇది దాదాపు 80 శాతంగా నమోదైంది. ఇందులో ఏప్రిల్లో నిర్వహించే ఎర్లీబర్డ్ పథకంలో భాగంగా గుండ్లపోచంపల్లిలో 36 శాతం వరకు పన్ను వసూలైంది. కరోనా ఉన్నప్పటికీ గతేడాది 99 శాతం వసూలును పూర్తి చేశారు. మేడ్చల్లో డిమాండ్ రూ.7,89, 97,000 ఉండగా శనివారం రూ.6,67,40,000 వసూలు చేశారు. ఇది దాదాపు 85 శాతంగా నమోదైంది. ఎర్లీబర్డ్ పథకం కింద ఈ మున్సిపాలిటీలో దాదాపు రూ.2 కోట్ల వసూలు చేశారు. నాలుగు రోజులే గడువు ఉండటంతో గుండ్లపోచంపల్లిలో కమిషనర్ లావణ్య, ఆర్వో శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సిబ్బంది ముమ్మరం చేశారు. మేడ్చల్లో కమిషనర్ అహ్మద్ షఫీయుల్లా, ఆర్వో శ్రీనివాసులు ఆధ్వర్యంలో సిబ్బంది శ్రమిస్తున్నారు.
వందశాతం వసూలు చేస్తాం
ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యతనిస్తున్నాం. పారిశుధ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు కూడా అంతే బాధ్యతగా పన్నులు చెల్లించాలి. ఎర్లీబర్డ్ పథకం కింద ఏప్రిల్లో చెల్లిస్తే 5 శాతం పన్నులో మినహాయింపు ఉంటుంది. మే, జూన్లో చెల్లిస్తే అదనపు రుసుం చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆ తర్వాత 2 శాతం అదనంగా రుసుం చెల్లించాలి. మార్చి 31 వరకు కూడా చెల్లించకపోతే మరింత భారం అవుతుంది. సాధ్యమైనంత మేరకు పన్నులు చెల్లించాలి. -మద్దుల లక్ష్మీశ్రీనివాస్, చైర్పర్సన్ గుండ్లపోచంపల్లి
ప్రజలు సహకరించాలి
ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి, అభివృద్ధికి సహకరించాలి.ప్రజలను చైతన్య పరుస్తూ 85 శాతం పన్నులు వసూలు చేశాం. నాలుగు రోజుల్లో 100 శాతం పూర్తి చేసేందుకు కృషి చేస్తాం. అధికారులు, సిబ్బంది ఇందుకోసం శ్రమిస్తున్నారు. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించాలి. -మర్రి దీపికా నర్సింహా రెడ్డి, చైర్పర్సన్, మేడ్చల్ మున్సిపాలిటీ