Hyderabad | హైదరాబాద్ : సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం( Rashtrapati Nilayam )ను మరోసారి ప్రజల సందర్శన కోసం తెరవనున్నారు. ఈ ఏడాది మార్చి 22న ఉగాది( Ugadi ) పండుగను పురస్కరించుకొని రాష్ట్రపతి నిలయంను తెరవనున్నారు. ఆ రోజు నుంచి ఈ ఏడాది మొత్తం ప్రజలు సందర్శించే అవకాశం కల్పించారు. అయితే ప్రతి ఏడాది రాష్ట్రపతి విడిది ముగిసిన అనంతరం 15 రోజుల పాటు ప్రజలకు సందర్శించే అవకాశం కల్పించేవారు. కానీ ఈ వారసత్వ సంపదను, అందమైన గార్డెన్ను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో ఉగాది పర్వదినాన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. ఇక రాష్ట్రపతి నిలయంను సందర్శించాలనుకునే వారు మార్చి 14వ తేదీ నుంచి రాష్ట్రపతి నిలయం వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఛార్జీలను భారతీయులకు ఒక్కరికి రూ. 50 గా, విదేశీయులకు రూ. 250గా నిర్ణయించారు. సోమవారం, ప్రభుత్వ సెలవు దినాల్లో తెరవరు. మిగతా రోజుల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంచనున్నారు. సాయంత్రం 4 గంటల వరకే సందర్శకులకు అనుమతి ఉంటుంది.