బండ్లగూడ,మార్చి 17: పల్లె చెరువు వద్ద చేపడుతున్న అక్రమ నిర్మాణాలను గురువారం రాజేంద్రనగర్ తహసీల్దార్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆర్ఐ సారిక, రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ చంద్రశేఖర్ మాట్లాడుతూ గతంలో కురిసిన వర్షాలతో పల్లె చెరువు తెగి అనేక సమస్యలను తెచ్చి పెట్టిన విషయం తెలిసిందే.ప్రభుత్వ ఆదేశాలతో అప్పట్లో పల్లె చెరువు కట్టను పునర్నిర్మించారన్నారు. కాగా ప్రస్తుతం కొంత మంది వ్యక్తులు పల్లె చెరువు వద్ద అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారన్నారు. సమాచారం తెలియడంతో వెంటనే పల్లె చెరువు వద్దకు వచ్చి అక్రమ నిర్మాణాన్ని తొలగించడంతో పాటు చెరువులో మట్టి పోస్తూ చదును చేస్తున్నా వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆక్రమణదారులకు చెందిన నాలుగు లారీలను సీజ్ చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే ఎంతటి వారైనా సరే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.