మైలార్దేవపల్లి, నవంబర్ 28: తెలంగాణకు కావాల్సింది బలమైన నాయకత్వం అని, స్థిరమైన ప్రభుత్వం అని అది ఒక్క కేసీఆర్తోనే సాధ్యమని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి టి.ప్రకాష్ గౌడ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన మంగళవారం మైలార్దేవపల్లి డివిజన్ పరిధిలో భారీ ర్యాలీలు, పాదయాత్రలు, రోడ్ షోలు, సమావేశాలను నిర్వహించారు.
ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమాలు నిర్విరామంగా సాయంత్రం 5 గంటల వరకు కొనసాగాయి. రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే టి.ప్రకాష్ గౌడ్ ఉత్సాహంగా నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీలు, పాదయాత్రల్లో పాల్గొన్నారు. దీంతో నాయకుల్లో మరింత జోష్ నిండింది. మహిళలు పెద్ద ఎత్తున హాజరై ఎమ్మెల్యే టి.ప్రకాష్ గౌడ్ బొట్టుపెట్టి హారతులు పట్టారు. అడుగడుగునా నీరాజనం పలుకుతూ బీఆర్ఎస్ ర్యాలీకి బ్రహ్మరథం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే టి.ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ, రాజేంద్రనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానన్నారు. మరింత ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు తనను మరోసారి గెలిపించాలని ఓటర్లను కోరారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలకు అండగా నిలుస్తూ రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారు. అభివృద్ధి చేసే ప్రభుత్వానే ప్రజలంతా ఎన్నుకోవాలన్నారు. మాయమాటలతో మభ్యపెట్టే బీజేపీ, కాంగ్రెస్లను నమ్మొద్దన్నారు. నిరంతరం ప్రజల్లో ఉండే తనకు ప్రజను ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మైలార్దేవపల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ టి.ప్రేమ్దాస్ గౌడ్, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు టి.ప్రేమ్గౌడ్, కాశీ గారి యాదగిరి, గుమ్మడి కుమార్, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.