సిటీబ్యూరో, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాగల మరో మూడు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఆవర్తనం, అల్పపీడనం కారణంగా గత మూడు రోజులుగా గ్రేటర్లో వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే.
శుక్రవారం రాత్రి 9గంటల వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంతంలో అత్యధికంగా 3సెం.మీ, చర్లపల్లి, కుషాయిగూడలో 1.7సెం.మీ, కాప్రాలో 1.3సెం.మీ, కుత్బుల్లాపూర్లో 1.3సెం.మీ, ఉప్పల్ రాజీవ్నగర్, ఏఎస్.రావు నగర్, నేరేడ్మెట్లో 1.2సెం.మీ, శేరిలింగంపల్లి, మియాపూర్, మల్లాపూర్, సైదాబాద్ కుర్మగూడ ప్రాంతాల్లో 1.0సెం.మీ.. చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్డీపీఎస్ అధికారులు తెలిపారు.