సిటీబ్యూరో, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ప్రజలకు భద్రత కల్పించడంతో పాటు నేర రహిత సమాజం కోసం పోలీసులు నిరంతరం కృషి చేయాలని, అదే పోలీసుల ధ్యేయమని రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్బాబు అన్నారు. రాచకొండ కొత్త సీపీగా బాధ్యతలు స్వీకరించిన తరువాత శనివారం తొలిసారిగా సీపీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సుధీర్బాబు మాట్లాడుతూ రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో నేరాలను అరికట్టేందుకు పోలీసులు మరింత కృషి చేయాలని, నేరస్తులను పట్టుకోవడంలో, నేరపరిశోధనలో సాంకేతిక ఆధారాలతో పాటు సీసీ కెమెరాలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాలను వెంటాడి పట్టుకోవాలని ఆదేశించారు.
రాచకొండ పరిధిలోని పాత నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా పెట్టాలన్నారు. రోజువారీ పెట్రోలింగ్ను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని, వీలైనంత తక్కువ సమయంలో బాధితుల వద్దకు చేరుకోవాలని, ముఖ్యంగా విజుబుల్ పోలీసింగ్ను పెంచాలని ఆదేశించారు. పోలీసు అధికారులు, సిబ్బంది సివిల్ తగాదాల్లో తలదూర్చితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులు, సిబ్బంది తమ స్టేషన్ పరిధిలో ప్రతిరోజూ కనీసం 15నిమిషాలు ప్రజల మధ్య తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకుని వారితో మమేకమవ్వాలని సూచించారు. పోలీసులు తమ విధి నిర్వహణలో పారదర్శకంగా, నిజాయతీగా జవాబుదారితనంతో వ్యవహరించాలన్నారు. చట్టపరిధిలో, దర్యాప్తు నిబంధనలకు అనుగుణంగానే నేర పరిశోధన జరగాలని, గరిష్ఠ శిక్షా రేటు సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. మహిళల సంరక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, షీ టీమ్స్ బృందాలను మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు.
డ్రగ్స్ రవాణా, వినియోగం, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులను సీపీ సుధీర్బాబు ఆదేశించారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ వినియోగం లేకుండా సూక్ష్మ నిఘా పెట్టాలని ఆదేశించారు. డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో జరిగిన ఈ సమావేశంలో రాచకొండ అదనపు కమిషనర్ తరుణ్జోషి, సైబర్క్రైమ్ డీసీపీ అనురాధ, యాదాద్రి డీసీపీ రాజేశ్ చంద్ర, మహేశ్వరం డీసీపీ శ్రీనివాస్, మల్కాజిగిరి డీసీపీ జానకి, రోడ్ సేఫ్టీ డీసీపీ శ్రీబాల, అడ్మిన్ డీసీపీ ఇందిర, అదనపు డీసీపీ శ్రీనివాస్రెడ్డితో పాటు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.