హైదరాబాద్ : అల్లరి మూకలకు రాచకొండ పోలీసుల హెచ్చరిక. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా పాత వరద వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంది. ఇటీవలి కాలంలో హైదరాబాద్లో తొలకరి జల్లులు ఊపందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి నుంచి పలు సోషల్ మీడియా వేదికల్లో పాత వరద వీడియోలనే తాజావిగా పేర్కొంటూ అల్లరి రాయుళ్లు సర్క్యూలేట్ చేస్తున్నారు. ఈ వీడియోలు లోతట్టు నివాస ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కావునా వీడియోలు షేర్ చేసే ముందుకు ఓసారి వెరిఫై చేసుకోవాలన్నారు. ప్రజలను భయాందోళనకు గురిచేసేలా పాత వీడియోలను షేర్ చేసే వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వర్షాల నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులను జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్, ఇతర అధికారులతో కలిసి స్థానిక పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.