కుత్బుల్లాపూర్, నవంబర్ 6 : అహర్నిశలు ప్రజాభివృద్ధే లక్ష్యంగా అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కేపీ వివేకానంద్ కోరారు. సోమవారం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రజాశీర్వాద సభలు, భారీ ర్యాలీలలో విస్తృతం ప్రచారం చేపట్టారు. కొంపల్లి మున్సిపాలిటీ 8వ వార్డులో రవీందర్రెడ్డి, కిట్టు, 6వ వార్డులో కొంపల్లి కమాన్ నుంచి గజానన్ అపార్ట్మెంట్ వరకు భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. అనంతరం స్థానిక కౌన్సిలర్ జంద కుమార్ ఆధ్వర్యంలో ప్రజాశీర్వాద సభలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు పరిస్థితులు ఎలా ఉండే.. ఇప్పుడు ఎలా ఉన్నదో ప్రజలు గమనించాలన్నారు. నాడు మంచినీటి కోసం ట్యాంకర్ల వద్ద యుద్ధాలు జరిగేవని, సీఎం కేసీఆర్ ఇంటింటికీ భగీరథ నీటిని తీసుకువచ్చి.. ట్యాంకర్లకు పనిలేకుండా చేశారని తెలిపారు. ఏ బస్తీకి వెళ్లినా.., ఏ కాలనీకి వెళ్లినా.. మనం చేసిన అభివృద్ధే కనిపిస్తున్నదని చెప్పారు.
నాలాలను పునరుద్ధరించి, రోడ్లను విస్తరించి ముంపు, ట్రాఫిక్ సమస్య లేకుండా చేశామని తెలిపారు. నియోజకవర్గంలో సుమారు 6వేల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టి, ఆదర్శంగా మార్చామని అన్నారు. మరోసారి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపాలని కోరారు. కుత్బుల్లాపూర్లో హ్యాట్రిక్ గులాబీ జెండాను ఎగురవేయడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కొంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, ఎన్నికల ఇన్చార్జి దూదిమెట్ల సోమేశ్యాదవ్, వార్డు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ మెంబర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.