చర్లపల్లి, నవంబర్ 10: విభజన చట్టంలోని హామీలను నెరవేర్చని ప్రధాని నరేంద్రమోదీ పర్యటనను అడ్డుకుంటామని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా ఏఐవైఎఫ్ అధ్యక్షుడు సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను నిరసిస్తూ ఈసీఐఎల్ చౌరస్తాలో ర్యాలీ నిర్వహించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, కార్పొరేట్ శక్తులకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభించేందుకు వస్తున్న మోదీ రాజకీయ స్వలాభ కుట్రలో భాగమేనన్నారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బంజారాహిల్స్, నవంబర్ 10: రాష్ర్టానికి ప్రధాని మోదీ రాకను వ్యతిరేకిస్తూ నగరంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. ‘మోదీ నో ఎంట్రీ టు తెలంగాణ’ అంటూ జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చేనేత పై కేంద్ర ప్రభుత్వం విధించిన 5శాతం జీఎస్టీని వెంటనే వెనక్కు తీసుకోవాలని ఫ్లెక్సీల్లో డిమాండ్ చేశారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ ఫ్లెక్సీలను తొలగించారు.
నిధులు విడుదల చేశాకే అడుగు పెట్టాలి
హిమాయత్నగర్, నవంబర్10: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 15వ ఫైనాన్స్ నిధులు మంజూరు చేసిన తరువాతే మోదీ తెలంగాణలో అడుగు పెట్టాలని రాష్ట్ర సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు చక్కటి వెంకటేశ్యాదవ్ డిమాండ్ చేశారు.గురువారం బషీర్బాగ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గత ఎనిమిది నెలలుగా ఎఫ్ఎఫ్సీ నిధులు విడుదల చేయక పోవడంతో గ్రామాల అభివృద్ధి కుంటుపడుతున్నదన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్రం రక రకాల ఆంక్షలు విధిస్తోందని ఆరోపించారు. ఎఫ్ఎఫ్సీ నిధులు మంజూరు చేయకుండా మోదీ ఈ నెల 12న రాష్ర్టానికి వస్తే అడుగడుగున అడ్డుకుంటామని హెచ్చరించారు.
బీసీ కులగణనపై మోదీ తన వైఖరి స్పష్టం చేయాలి
హిమాయత్నగర్, నవంబర్ 10: కులగణనపై కుంటిసాకులు చెబుతూ కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తున్నందున ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణకు రావడాన్ని నిరసిస్తూ ఈ నెల 12న నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు టి.వెంకట్రాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయబండి పాండు రంగచారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశ వ్యాప్తంగా బీసీ కులగణన చేస్తే విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలు మరింత రాణించే అవకాశం ఉన్నదని తెలిపారు. అన్ని జిల్లాలతో పాటు ట్యాంక్బండ్, నగరంలో అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగే నిరసన కార్యక్రమాల్లో బీసీలు అధిక సంఖ్యల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈడీ దాడులు అమానుషం
మంత్రి గంగుల కమలాకర్ పై ఈడీ ఐటీ దాడులు చేయడం అమానుషమని గాజులరామారం కార్పొరేటర్ రావుల శేషగిరిరావు అన్నారు. దాడులను వెంటనే ఆపాలని గురువారం డివిజన్లో మున్నూరు కాపు సంఘం, బీసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మను దహనం చేశారు. కుత్బుల్లాపూర్ మున్నూరు కాపు సంఘం ఉపాధ్యక్షుడు బూరుగు లక్ష్మీనారాయణ, కూకట్పల్లి డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, మున్నూరు కాపు సంఘం ఉపాధ్యక్షులు సాయిని శ్రీనివాస్, రాజన్న, నరసయ్య, నరేందర్, శ్రీరాములు, కాపు సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
– గాజులరామారం, నవంబర్ 10