సిటీబ్యూరో, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో రాజకీయం వేడెక్కింది..! పోరు బరిలో నిలిచే అభ్యర్థులెవరో తేలిపోవడంతో నామినేషన్లు వేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. పోల్ పోరులో తాడోపేడో తేల్చుకునేందుకు రె‘ఢీ అయ్యారు.. జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలతో బహిరంగ సభలు, రోడ్ షోలు, అంతర్గత సమావేశాలతో పాటు స్టార్ క్యాంపెయినర్లను ప్రచారలోకి దించి ఓట్లను కొల్లగొట్టేందుకు అభ్యర్థులు పక్కా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇప్పటికే రెండున్నర నెలలుగా గులాబీ పార్టీ అభ్యర్థులు ప్రజాక్షేత్రంలోనే ఉంటూ అన్ని వర్గాల ప్రజల మద్దతును కూడగట్టారు.
అంతేకాదు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలు, బూత్ లెవల్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు వంటి కార్యక్రమాలతో అభ్యర్థుల తరఫున ప్రచారం చేసి విపక్షాలకు దిమ్మతిరిగే షాకిచ్చారు. అభ్యర్థులు సైతం ఒకవైపు పాదయాత్రలు, మరోవైపు అన్ని వర్గాల మద్దతును కూడగట్టేందుకు ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు మీకు అన్ని విధాలుగా అండగా ఉన్న తమకు నవంబర్ 30వ తేదీన జరిగే ఎన్నికల్లో మద్దతుగా నిలిచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు.
ఇంటింటికీ ప్రచారం, పాదయాత్రలు ఒకవైపు.. మరోవైపు కలిసివచ్చే నేతలను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారు. నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలతో క్యాడర్లో నూతనోత్తేజాన్ని నింపుతూ అందరినీ ఒక్క తాటిపైకి తీసుకువచ్చి అభ్యర్థుల గెలుపునకు బాటలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పదేండ్ల అభివృద్ధి, ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టో ప్రచార అస్త్రంగా కాలనీలు, బస్తీలు తిరుగుతూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు.
కాంగ్రెస్, బీజేపీలు 65 ఏండ్లు పాలించిన అభివృద్ధి జరగలేదని, గడిచిన పదేండ్లలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం వందేండ్ల అభివృద్ధికి బాటలు వేసిందంటూ ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారం లో అన్ని పార్టీల కంటే ముందు న్న బీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీల డిపాజిట్లను గల్లంతు చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పావులు కదుపుతున్నారు. కలిసి వచ్చే ఇతర పార్టీల నేతలకు గులాబీ కండువాలు కప్పుతూ నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతూ ప్రతిపక్ష పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.