సిటీబ్యూరో, మే 13 (నమస్తే తెలంగాణ): స్టాక్ ట్రేడింగ్లో టిప్స్ చెబుతామంటూ నమ్మించి ఓ ప్రైవేట్ ఉద్యోగికి సైబర్నేరగాళ్లు రూ.3.27 లక్షలు టోకరా వేశారు. అల్వాల్కు చెందిన బాధితుడి ఫోన్ నెంబర్ను గుర్తుతెలియని వ్యక్తులు మిని173డి రన్నర్స్ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్కు యాడ్ చేశారు. అందులో ట్రేడింగ్స్ టిప్స్ చెబుతూ, ఆ టిప్స్ ఫాలో కావడంతో తమకు లాభాలొచ్చాయని అందులోని వారు స్క్రీన్ షాట్స్ పెడుతున్నారు. మీరు కూడా చేరండి లాభాలొస్తాయని ఫోన్లు చేసి, సీఎంఈ గ్రూప్ పేరుతో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్కు యాడ్ చేశారు.
దాని ద్వారా లింక్ ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలని సూచించడంతో బాధితుడు అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు. మొదట కొంత పెట్టుబడి పెట్టడంతో లాభం వచ్చింది. ఆ తరువాత మాటలు చెబుతూ దఫదఫాలుగా రూ.3.30 లక్షలు పెట్టుబడి పెట్టించారు. అందులో రూ. 3 వేలు మాత్రమే తిరిగి వచ్చాయి. స్క్రీన్పై కన్పిస్తున్న డబ్బులను విత్ డ్రా చేసుకోవడానికి వీలు లేకపోవడంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు మల్కాజిగిరి సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.