ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 13: సామాజిక పరివర్తన, సామాజిక మార్పులో పాటలు విశేషమైన పాత్ర పోషిస్తాయని ప్రొఫెసర్ కాశీం అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఓయూ సహాయ కార్యదర్శి ఆరెకంటి సాయిభగత్ గళం నుంచి జాలువారిన ‘బాబా సాహెబూ.. బడుగు జీవుల అడుగుజాడవు’అనే పాటను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో గురువారం ఆవిష్కరించి మాట్లాడారు. పాటల సాహిత్యం సామాజిక విప్లవ క్రమంలో ఒక భాగమని చెప్పారు. తెలుగు సాహిత్యంలో ‘అందుకో దండాలు బాబా అంబేద్కరా’ అనే పాట సామాజిక మార్పు కోరుకునే సామాజిక కార్యకర్తల ప్రతి ఒక్కరి నోట అలా వచ్చి పడేదని వివరించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ విప్లవంలో పాటలు విశేషమైన పాత్రను పోషిస్తాయని పేర్కొన్నారు. దళిత పాంథర్స్ ఉద్యమం విజయవంతం అయ్యేందుకు పాట సాహిత్యం ఎంతో కీలకమైన పాత్రను పోషించిందని గుర్తు చేశారు. తెలుగు నేలపై గద్దర్, గోరెటి వెంకన్న, జయరాజు వంటి కవులు పాట సాహిత్యం ద్వారా ముందుకు వచ్చి సమాజంలో మార్పుకు బాటలు వేసి సాహిత్య ప్రతినిధులుగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో పలు విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలు, కవులు, కళాకారులు పాల్గొన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన వాల్పోస్టర్ను ఆర్ట్స్ కళాశాల ఆవరణలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కమల్ సురేశ్ మాట్లాడుతూ అంబేద్కర్ జయంతిని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటారని గుర్తు చేశారు. సమసమాజ నిర్మాణంలో అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు అశోక్, ప్రవీణ్రెడ్డి, శ్రీహరి, జీవన్, రాజు, హరిప్రసాద్, తోట శ్రీను, శ్రీధర్, కోటి పాల్గొన్నారు.