సిటీబ్యూరో, జూలై 9 ( నమస్తే తెలంగాణ ): ఆలోచనలకు పదును పెట్టారు. సమ సమాజాన్ని మేల్కొలిపే, ఆలోచింప చేసే కథలు అందించారు. ఒక్కో కథకు ఒక్కో చరిత్ర.. చదివినకొద్దీ.. ఇంకా చదవాలనిపించే ఉత్సాహం. ఒకటి కాదు.. రెండు కాదు.. వేలాదిగా కథలు వచ్చిచేరాయి.. తెరిచి చూస్తే. మనస్సు పులకరించేలా.. రోమాలు నిక్కబొడుచుకొని చదివేలా.. గడిచిన రోజులు గుర్తుకు తెచ్చాయి. ఇందంతా ‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు’ ప్రజా గ్రంథాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన కథల పోటీలకు వచ్చిన స్పందన. నాటు నాటు కథలకు.. ధీటైన పురస్కారాలను రవీంద్రభారతి వేదికగా రచయితలు అందుకున్నారు. ‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు’ ప్రజా గ్రంథాలయం సంయుక్తాధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ జాయింట్ ఇన్స్పెక్టర్ జనరల్, ప్రజా గ్రంథాలయం ముఖ్య సలహాదారు వేముల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఇష్టాగోష్ఠి కార్యక్రమానికి రచయితలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
కథల ప్రాధాన్యతను, అవసరాన్ని వారంతా పంచుకున్నారు. సమాజాన్ని మేల్కొల్పే కథలను అందించే అదృష్టాన్ని కల్పించిన ‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు’ గ్రంథాలయానికి అభినందనలు తెలిపారు. తమ ప్రతిభను ముల్కనూరు గ్రంథాలయం వెలికితీస్తే.. ప్రపంచానికి పరిచయం చేసింది ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక అని రచయితలు జై కొట్టారు. బహుమతులు గెలుచుకున్న రచయితలంతా వారి వారి కథల ఆత్మను ఆవిష్కరించారు. కథలో ఉన్న లోటుపాట్లపై సైతం చర్చించారు. భవిష్యత్తు తరాలకు చరిత్రను బోధించేల ఈ కథలు సాక్ష్యాలుగా నిలుస్తాయని చెప్పారు. వారంతా ‘నమస్తే తెలంగాణ’తో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
అడవిపువ్వుకు అపూర్వ స్పందన
నేను రాసిన అడవి పువ్వు కథకు బహుమతి రావడం సంతోషంగా ఉంది. గతంలో సాహిత్య లోకంలో జరుగుతున్న రాజకీయాలు చూసి కథలు రాయాలనే ఆసక్తి తగ్గింది. కానీ తెలంగాణ ప్రభుత్వం రచయితలను గుర్తించి గౌరవించుకునే సంప్రదాయం చూస్తే మళ్లీ నాకు కథలు రాయాలనే ఆసక్తి కలిగింది. ఆదివాసీలపై అడవిపువ్వు అనే కథకు అపూర్వ స్పందన వచ్చింది. అక్కడి వైద్యులు, పోలీసులు నాకు ఫోన్ చేసి అభినందించారు. నా ఫ్రెండ్స్ అందరికీ తెలుగు రాదు. కానీ నాకు ఈ బహుమతి వచ్చిన విషయం తెలుసుకుని వారంతా తెలుగు నేర్చుకోవాలని.. కథలు రాస్తామని ఉత్సాహం చూపిస్తున్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ముల్కనూరు, నమస్తే తెలంగాణకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మంచి కథలను గుర్తించి వాటికి గౌరవం ఇవ్వడం అనేది గొప్ప విషయం.
– కిరణ్ విభావరి, (ద్వితీయ బహుమతి విజేత)
రేపటి తరానికి గైడ్లా..
నేను ఇసప్పురుగు అనే కథ రాశాను. ఆ కథకు బహుమతి రావడం సంతోషంగా ఉంది. సమాజాన్ని మేల్కొల్పడంలో కథలు అధిక ప్రభావం చూపుతాయి. సంఘటనలు, సంభాషణల ద్వారా కథలు ఆకట్టుకుంటాయి. నమస్తే తెలంగాణ, ముల్కనూరు గ్రంథాలయానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గత పరిస్థితులు సాహిత్యాన్ని మరిచిపోయేలా చేశాయి. ఇక సాహిత్యం కనుమరుగయ్యే దుస్థితిలో ఉన్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం సాహిత్యానికి ప్రత్యేక గుర్తింపునిచ్చి గౌరవించింది. రేపటి తరానికి ఈ ముల్కనూరు గుర్తించిన కథలు ఒక గైడ్లా ఉపయోగపడుతాయని ఆశిస్తున్నా.
– డా.మద్దెర్ల రమేశ్, టీచర్. (ద్వితీయ బహుమతి విజేత)
కథలు రాయాలనుకునే వారికి వేదిక
వలస కలలు కథకు బహుమతి రావడం సంతోషంగా ఉంది. తెలుగు మాట్లాడటానికే తక్కువగా భావిస్తున్న పరిస్థితుల మధ్య ఆ భాషను పరిరక్షించుకోవడంతో పాటు తెలుగును ప్రతి ఒక్కరూ స్వాగతించేలా కృషి చేయాల్సి ఉంది. ఆ బాధ్యత ‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు’ గ్రంథాలయం తీసుకుంది. అందుకే కథల పోటీలు నిర్వహించి మంచి కథలను గుర్తించి రేపటి తరానికి ఉపయోగపడేలా కథలను ప్రచురిస్తున్నది. వీరు చేస్తున్న కృషి కొత్తగా కథలు రాయాలనుకునే వారికి ఓ వేదిక అవుతుంది. మా అమ్మకు పుస్తకాలు చదివే అలవాటు ఉండేది. అందుకే నాకు చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదవడం అలవాటైంది. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన పరిస్థితులపైనా కథలు రాశాను. జార్ఖండ్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు అక్కడి విద్యార్థులకు తెలుగు ట్యూషన్ కూడా చెప్పాను.
– అత్రివత్రి ధర్మశాంతి ప్రభాకర్ రావు, రిటైర్డ్ జనరల్ మేనేజర్(ఎంఈసీఓఎన్) ( తృతీయ బహుమతి విజేత)
నా కథ నాకే పోటీ
నా రచనను వెలికితీసింది ముల్కనూరు గ్రంథాలయం అయితే.. నన్ను ప్రపంచానికి పరిచయం చేసింది ‘నమస్తే తెలంగాణ’. వీటికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. కొత్తకొత్త అంశాలపై కథలు రాయడంలో వీరి ప్రోత్సాహం మరువలేనిది. ఈ పోటీలు నిర్వహించడం వల్ల మాకు మా ప్రతిభను మెరుగుపరుచుకునే అదృష్టం దక్కుతుంది. మాకు ఇదొక గుర్తింపులా భావిస్తున్నా. నేను మొదటగా రాసిన కథ చీకటి వెలుగులు -2020లో ఎంపికైంది. అనంతరం నా కథను నేనే చాలెంజ్గా తీసుకొని మరో కథ రాశాను. దానికి ప్రథమ బహుమతి వచ్చింది. ఇప్పుడు నేను రాసిన ముసురు అనే కథకు మళ్లీ బహుమతి రావడం గొప్పగా ఉంది. విజేతలతో సంబంధం లేకుండా రచయితలతో ఇష్టాగోష్ఠి నిర్వహించి ప్రతీ రచయితను సమానంగా గౌరవిస్తారు. అది గొప్ప విషయం.
– స్ఫూర్తి కందివనం (తృతీయ బహుమతి విజేత)
రేపటి తరానికి గైడ్లాగా..
ఇబ్లీస్ కథ రాయడం నా అదృష్టంగా భావిస్తున్నా. నేను రాసిన కథకు ప్రథమ బహుమతి రావడం సంతోషంగా ఉంది. ముల్కనూరు గ్రంథాలయం, నమస్తే తెలంగాణకు రుణపడి ఉంటా. రచయితలను ప్రోత్సహించే కార్యక్రమం తీసుకోవడం గొప్ప విషయం. ప్రతి ఒక్క కథకు సముచిత స్థానం కల్పించడంతో పాటు బహుమతులు అందించి సన్మానించడంతో అనేక రచయితలు గౌరవంగా భావిస్తున్నారు. నేను రాసిన ఇబ్లీస్ అంటే సైతాన్. ఖురాన్, భగవద్గీత బోధించేవి ఒకటైతే.. వాటి పేరు చెప్పి పాటించేవి మరొక్కటి. అందుకే సమాజంలో విద్వేషాలు రగులుతున్నాయి. అందరూ ఒక్కటే అని చెప్పడమే నా కథకు ఆత్మ. తెలంగాణ ప్రభుత్వం రచయితలకు గొప్ప గౌరవం అందించేలా కార్యక్రమాలు తీసుకోవడం రచయితల అదృష్టంగా భావిస్తున్నాను.
– హుమాయూన్ సంఘీర్ (మొదటి బహుమతి విజేత)
వందేళ్ల చరిత్ర కనిపిస్తుంది
నేను రాసిన ‘ఏలి ఏలి లామా సబక్తానీ’ కథకు బహుమతి రావడం సంతోషంగా ఉంది. పంజరంలో ఉండే పక్షి కూడా పాడుతుంది అనేది నా కథకు ఆత్మ. ముల్కనూరు గ్రంథాలయ కథలు చూస్తే వందేళ్ల చరిత్ర కనిపిస్తుంది. ఉద్యమాలు, అసమానతలు, మానవీయకోణం, బలహీనతలపై అనేక విభిన్న రకాల కథలు ఉన్నాయి. నడుస్తున్న చరిత్రను రికార్డు చేస్తుంది. ముల్కనూరు, నమస్తే తెలంగాణకు రుణపడి ఉంటా. వాళ్లు ఇలాంటి కార్యక్రమంతో రచయితలకు ప్రోత్సాహం అందిస్తున్నారు.
– సుగుణారావు(తృతీయ బహుమతి విజేత)
గొప్పగా భావిస్తున్నా..
వేగుచుక్క అనే కథకు నాకు రూ.5వేల బహుమతి రావడం సంతోషంగా ఉంది. అసలు నా కథను గుర్తించడమే గొప్పగా భావిస్తున్నాను. మా అన్నయ్య ప్రోత్సాహంతో నాకు కథలు రాయడం అలవాటైంది. మొదటి సారి రాసిన అమ్మ అంతే అనే కథ సెలక్ట్ కాలేదు. అయినా నేను బాధపడలేదు. దానిని పోటీగా తీసుకొని మళ్లీ వేగుచుక్క అనే కథ రాశాను. దీనికి గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. మాలాంటి రచయితలను గుర్తించి సత్కరిస్తున్న ‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు’ గ్రంథాలయానికి రుణపడి ఉంటా.
– జాస్తి రమాదేవి, రచయిత