Power Cuts | సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): కరెంటు పోయిందా.. ఇక అంతే సంగతులు.. ఎప్పుడు వస్తుందోనని వేచిచూడాల్సిందే. గంట గడిచినా.. పునరుద్ధరణ ఉండటం లేదు. గ్రేటర్లో విద్యుత్ సరఫరా వ్యవస్థ ప్రస్తుత తీరిది. అధికారికంగా ఎలాంటి కరెంటు కోతలు లేకపోయినా..సబ్ స్టేషన్లలో నిరంతరం నాణ్యమైన విద్యుత్ ఉన్నా… క్షేత్ర స్థాయిలో అంతరాయాలు నిత్యకృత్యం అన్నట్లు మారాయి. ట్రాన్స్ఫార్మర్ల నుంచి ఇండ్లకు వెళ్తున్న లైన్లలోనే ఉత్పన్నమవుతున్న సమస్యను పరిష్కరించడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. స్థానికంగా ఆకస్మాతుగా సరఫరా నిలిచిపోతే దాని పునరుద్ధరించేందుకు సిబ్బంది గంటల తరబడి సమయం తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఎక్కువయ్యాయి.
కరెంటు సరఫరా నిలిచిపోయిందని అనేకసార్లు ఫోన్లు చేస్తే తప్ప.. క్షేత్రస్థాయిలోని సిబ్బంది స్పందించడం లేదని నగరంలోని పలు కాలనీ వాసులు వాపోతున్నారు. అసలే వేసవి కాలం కావడంతో ఈ సమస్యను గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ వినియోగదారులు ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట ఎదుర్కొంటున్నారు. నిరంతరం నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తున్నామని చెబుతున్నారే తప్ప.. అలాంటి పరిస్థితి క్షేత్ర స్థాయిలో ఉండటం లేదని, కరెంటు పోవడం, రావడం షరా మామూలై పోయిందని విద్యుత్ వినియోగదారులు పేర్కొంటున్నారు. ట్రాన్స్ఫార్మర్ల దగ్గర ఫ్యూజ్ పోతే దాన్ని సరిచేసేందుకు 10-15 నిమిషాలు పడితే, ఎమర్జెన్సీ బృందాలు రావడానికి మాత్రం గంటకు పైనే పడుతోందని ఫిర్యాదుదారులు వాపోతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించేందుకు మొత్తం 9 సర్కిళ్లను, వాటి పరిధిలో డివిజన్స్, సబ్ డివిజన్, సెక్షన్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ప్రతి సెక్షన్ పరిధిలో క్షేత్ర స్థాయిలో లైన్ ఇన్స్పెక్టర్లతో పాటు లైన్మెన్లు, వారికి సహాయకులుగా హెల్పర్లు (ఆర్టిజన్స్) విధుల్లో ఉంటున్నా.. విద్యుత్ అంతరాయం విషయంలో తలెత్తున్న సమస్యలపై అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా కొత్త కనెక్షన్లు ఇవ్వడంలో చూపుతున్న ఆసక్తిని విద్యుత్ సరఫరా విషయంలో జరుగుతున్న అంతరాయంపై సెక్షన్ అధికారులు చూపడం లేదు.
కాలనీల్లో ఆకస్మాతుగా కరెంటు పోతే పునరుద్ధరించేందుకు వినియోగదారులు సెక్షన్ కార్యాలయానికి ఫోన్ చేస్తే ఎమర్జెన్సీ బృందాలకు ఫోన్ చేయాలని ఉన్నతాధికారులు చెబుతున్నారు. సమస్యను ఎమర్జెన్సీ బృందాలకు చెబితే తాము వేరే ఫిర్యాదు వస్తే దాన్ని సరిచేసి వస్తామని, సమయం పడుతుందంటూ ఫోన్ పెట్టేస్తున్నారు. ప్రతి సెక్షన్ పరిధిలో ఉండే లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లు, వారికి సహాయకులుగా ఉండే హెల్పర్లు విధుల్లో ఉంటున్నా వారు మాత్రం సమస్యను పరిష్కరించేందుకు ముందుకు రావడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.