మహేశ్వరం, జూలై 8: తెలంగాణ రాష్ట్రం అవతరించిన తొమ్మిదేండ్లలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని, మహేశ్వరం నియోజక వర్గాన్ని ఒక ప్రత్యేక విజన్తో విద్యా హబ్గా మారుస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరంలో రూ.కోటి తో నిర్మించిన డిగ్రీ కళాశాల భవనం, రూ. కోటి 29 లక్షలతో హాస్టల్ భవనం, నూతనంగా మంజూరైన పాలిటెక్నిక్ కళాశాలను ఎంపీపీ రఘుమారెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బడంగ్పేట్లో ఒక పాలిటెక్నిక్ కళాశాల, మహేశ్వరంలో రూ. 24 కోట్లతో రెండోది ఏర్పాటు చేస్తామని ఆమె అన్నారు. దాంతో పాటు డైట్ కళాశాల, కస్తూరి బా పాఠశాల, జిల్లా పరిషత్ పాఠశాల కేసీ తండాలో నిర్మిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 16 డిగ్రీ గురుకుల కళాశాలలు మంజూరు కాగా, రంగారెడ్డికి రెండొచ్చాయి. అందులో ఒకటి బాలికల కళాశాల షాద్నగర్కు, కందుకూరులో బాలురు డిగ్రీ బీసీ కళాశాలలు మంజూరు అయ్యాయని ఆమె తెలిపారు. నియోజక వర్గంలో విద్యాభివృద్ధికి నిధులు విరివిగా ఇస్తున్న సీఎం కేసీఆర్కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
మోదీ ప్రధాని అయ్యాక మోడల్ స్కూల్ రద్దు
మోడల్ స్కూల్లను మోడీ ప్రధాని అయ్యాక రద్దు చేశారని అన్నారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే రూ.400 కోట్ల భారంతో మోడల్ స్కూళ్లను నడిపిస్తున్నామని ఆమె తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు ప్రతి రూపంగా కార్పొరేట్ కన్నా మేటిగా ప్రభుత్వ బడులు ప్రక్షాళన జరుగుతున్నాయని ఆమె అన్నారు.
వంద కోట్లతో మహిళా యూనివర్సిటీ..
రూ.100 కోట్లతో రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేశామని ఆమె చెప్పారు. ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో భాగంగా మొదటి విడతగా 9123 పాఠశాలలో రూ. 3497.62 కోట్లతో పనులు చేపట్టి దాదాపుగా వెయ్యి పాఠశాలలను ఏక కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించినట్టు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో రూ.6 కోట్లతో నోటు పుస్తకాలు, రూ.10 కోట్ల 50 లక్షలతో 1.65 లక్షల మందికి రెండు జతల యూనిఫాంలు, రూ.5 కోట్లు విలువ చేసే 72 వేల మంది విద్యార్థులకు నోట్బుక్స్, రూ.18.15 లక్షలతో రాగి జావ, రూ.1.6 కోట్ల విలువ చేసే 1058 మంది ఉపాధ్యాయలుకు ట్యాబ్లు పంపిణీ చేసినట్టు ఆమె తెలిపారు.
తొమ్మిదేండ్లలో విప్లవాత్మక మార్పులు
సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల కాలంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని ఆమె గుర్తు చేశారు. 1200లకు పైగా గురుకులాలలో ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ. లక్ష 20 వేలు వెచ్చిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునితా ఆంధ్యానాయక్, సహకారబ్యాంక్ చైర్మన్ మంచెపాండు యాదవ్, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, ఎంఈవో కృష్ణయ్య, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ భవాని, సర్పంచులు మోతిలాల్ నాయక్, రాజునాయక్, నియోజక వర్గ ఉపాధ్యక్షుడు హనుమగల్ల చంద్రయ్య, కార్యదర్శి గుండెమోని అంజయ్య ముదిరాజ్, జిల్లా రైతు సమన్వయ సమితి నాయకుడు కూన యాదయ్య, బీఆర్ఎస్ పార్టీ మండల అద్యక్షుడు రాజునాయక్, వర్కింగ్ ప్రసిడెంట్ వర్కల యాదగిరిగౌడ్, కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఆదిల్ అలీ, నాయకులు మంత్రి రాజేశ్, వీరానాయక్, కంది రమేశ్ తదితరులు పాల్గొన్నారు.