సిటీబ్యూరో: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనది. దాన్ని ఓటర్లు తప్పనిసరిగా వినియోగించుకోవాలి. ఇదే నినాదంతో పోలింగ్ రోజు మే 13న ఓటర్లకు ఆన్లైన్ ట్యాక్సీ సేవల సంస్థ ర్యాపిడో ఉచిత రవాణా సేవలను అందిస్తున్నది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని పటిష్టం చేయాలనే దృఢ సంకల్పంతో ర్యాపిడో ఉచిత రైడ్లను హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ వంటి ప్రధాన నగరాల్లో అందిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి పవన్ గుంటుపల్లి తెలిపారు. అతి పెద్ద ప్రజాస్వామ్య పండగలో ఓటు వేయడానికి ప్రజలను ప్రోత్సహించేందుకు ర్యాపిడో తెలంగాణ ప్రధాన ఎన్నికల కార్యాలయంతో కలిసి పనిచేస్తోందని, ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చేయడమే ఏకైక లక్ష్యమన్నారు.
మే 13న రాష్ట్రంలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేసే ఓటర్లు ‘వోట్ నౌ’ కోడ్ను ఉపయోగించి.. ర్యాపిడో యాప్లో ఉచిత రైడ్లను పొందవచ్చు. పోలింగ్ రోజున ఉచిత రైడ్లను అందించేందుకు 100 కంటే ఎక్కువ నగరాల్లో 10 లక్షల మంది కెప్టెన్లను ర్యాపిడో అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు. దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ ఓటర్లకు ఉచితంగా ఆటో, క్యాబ్ రైడ్లు అందుబాటులో ఉంటాయని, ఇతర ఓటర్లకు బైక్ ట్యాక్సీలు ఉచిత రైడ్ను కల్పిస్తాయని చెప్పారు.
పోలింగ్ రోజు ర్యాపిడో ఓటర్ల కోసం ఉచిత రైడ్లు ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాజ్ రాజ్ అన్నారు. సోమవారం ఎల్బీ స్టేడియంలో ‘ర్యాపిడో బైక్ ట్యాక్సీ ఉచిత రైడ్లు’ ర్యాలీ కార్యక్రమాన్ని ఆయన హైదరాబాద్ సీపీ శ్రీనివాస్రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. హైదరాబాద్ జిల్లాలో ఓటింగ్ 60-65 శాతం పెరిగేలా ప్రతి ఒక్కరూ చొరవ తీసుకోవాలని వికాస్ రాజ్ అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు విశేష కృషి చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ర్యాపిడో బిజినెస్ హెడ్ రోహిత్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్, నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్రెడ్డితో కలిసి గన్ఫౌండ్రిలోని ఆల్ సెయింట్స్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని సందర్శించారు. హోం ఓటింగ్లో ఆదివారం నాటికి 571 ఓటర్లకు 479 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని జిల్లా ఎన్నికల అధికారి, బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి బల్దియా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 3986 పోలింగ్ స్టేషన్లలో పటిష్ట చర్యలు తీసుకున్నారు. 12231 బ్యాలెట్ యూనిట్లు, 4978 కంట్రోల్ యూనిట్లు, 5575 వీవీ ప్యాట్లను అందుబాటులో ఉంచారు. 20వేల మంది సిబ్బంది, 1200 మంది మైక్రో అబ్జర్వర్లుతో పాటు దాదాపు 6వేల మంది పోలీస్ సిబ్బంది ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నారు.