సిటీబ్యూరో, మార్చి 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో పోలియో చుక్కల పంపిణీ విజయవంతంగా సాగింది. తొలిరోజు 10 లక్షల మందికి పైగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఐదేండ్లలోపు పిల్లలు మొత్తం 5,06,930మంది చిన్నారులు ఉండగా, వారికి పోలియో చుక్కల పంపిణీ కోసం 2800 పోలియో బూత్లు, 85 ట్రాన్సిట్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి వెంకటి తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 11,200 మంది సిబ్బంది విధులు నిర్వర్తించారని, అదనంగా 79మొబైల్ టీమ్స్ కూడా చుక్కల పంపిణీ విధుల్లో పాల్గొన్నట్లు తెలిపారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా 4.1 లక్షల మందికి పోలియో చుక్కలు వేసినట్లు వెల్లడించారు. పోలియో చుక్కలు వేయించుకోని పిల్లలకు 4,5,6 తేదీల్లో ఇండ్ల వద్దే వేయనున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో మొత్తం 4,9,038మంది చిన్నారులు ఉండగా వారిలో 95శాతం మందికి పోలియో చుక్కలు వేసినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు వెల్లడించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలో 80శాతం మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసినట్లు అధికారులు వివరించారు.