Mahalakshmi | సిటీబ్యూరో, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): సిటీ బస్సులకు కష్టకాలం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన మహాలక్ష్మి పథకంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్టీసీని ప్రభుత్వమే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో బల్దియా కోట్లు ఖర్చు పెట్టి.. బస్ షెల్టర్లను ఏర్పాటు చేసింది. అయితే ఆయా ప్రాంతాల్లో ప్రయాణికులు ఎక్కడం దిగడం కోసం బస్సులను ఆపవద్దంటూ..ట్రాఫిక్ సమస్య పేరుతో పోలీసులు అభ్యంతరాలు పెడుతున్నారు.
ఈ విషయంలో ఆర్టీసీ డ్రైవర్లపై ఒత్తిడి కూడా తెస్తున్నారు. మహాలక్ష్మి పథకంతో సిటీబస్సుల్లో అధిక సంఖ్యలో మహిళలు ప్రయాణిస్తున్నారు. దీంతో ఆర్టీసీకి ఆదాయం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో ఒకవైపు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూనే.. బస్సులను ఎక్కడపడితే అక్కడ ఆపొద్దంటూ.. ఆంక్షలు పెట్టడం ఏమిటని పలువురు ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.
నగరంలో జూబ్ల్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్సిటీ, రాయదుర్గం వంటి అనే ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయని, దానికి ఆర్టీసీ సిటీ బస్సులే కారణాలవుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన షెల్టర్లలోనే బస్సులు ప్రయాణికుల కోసం నిలుపుతున్నామని ఆర్టీసీ గ్రేటర్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ కోసం గుర్తించిన చోట్ల ఉన్న బస్షెల్టర్లలో బస్సులు నిలుపవద్దని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారమే బస్షెల్టర్లలో బస్సులు నిలుపాలా? లేదా ? అనేదానిపైనా ఆర్టీసీ యాజమాన్యం కూడా నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు.
మొత్తానికి బస్షెల్టర్లలో సిటీ బస్సులు నిలుపడం విషయమై పోలీసు, జీహెచ్ఎంసీ, ఆర్టీసీ యాజమాన్యాల మధ్య ప్రస్తుతం సమన్వయం కొరవడినట్లు తెలుస్తున్నది. కాగా, రెండు రోజుల కిందట జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నగర పోలీసు విభాగంతో పాటు ఆర్టీసీ గ్రేటర్ అధికారులతో జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీనిపై మూడు ప్రభుత్వ విభాగాల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమైనట్లు చెబుతున్నారు. అయితే ప్రయాణికులు మాత్రం తమకు అందుబాటులో బస్షెల్టర్లు ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందని, లేదంటే ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాల్లో వెళ్లాల్సి వస్తుందని, ఇది తమకు తలకుమించిన ఆర్థిక భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.