ఘట్కేసర్/ఘట్కేసర్ రూరల్, ఏప్రిల్ 3 : తెలంగాణలోని సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా మారాయని, దేశమంతా సీఎం కేసీఆర్ వైపు చూస్తుందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పోచారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సోమవారం అన్నోజిగూడలో జరుగగా, ఘట్కేసర్ మండల ఆత్మీయ సమావేశం కొర్రెములలో జరిగింది. ఈ కార్యక్రమాలకు మంత్రితో పాటు మేడ్చల్ జిల్లా పార్టీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి, జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి రాజశేఖర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ దేశంలో అన్ని రాష్ర్టాలు తెలంగాణ మోడల్ను కోరుకుంటున్నాయని అన్నారు. వివిధ రాష్ర్టాలకు చెందిన ముఖ్య నేతలు బీఆర్ఎస్లో చేరుతుండటంతో ఇందుకు నిదర్శనమన్నారు.
రోజు రోజుకు బీఆర్ఎస్ బలం పెరుగుతుందని, ఏ రాష్ట్రంలో సభ నిర్వహించినా తండాపతండాలుగా ప్రజలు తరలివస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ దేశంలో అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రాబోయే ఎన్నికలలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఉనికి లేకుండా పోతుందన్నారు. సొంత ఇంటి స్థలం ఉన్న మహిళల పేరు మీద రూ.3లక్షలు ఇల్లు కట్టుకోవడానికి సీఎం కేసీఆర్ అందజేయనున్నారని తెలిపారు. వచ్చే నెల నుంచి లబ్ధిదారులకు నిధులు అందనున్నాయన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి తీసుకెళ్లి, మూడోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్కు వందకు పైగా సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దర్గ దయాకర్ రెడ్డి, పోచారం చైర్మన్ బీ. కొండల్రెడ్డి, బీఆర్ఎస్ ఘట్కేసర్ మండల అధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్రెడ్డి, పోచారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ అధ్యక్షుడు సురేందర్రెడ్డి, మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్గౌడ్, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షడు వెంకటేశ్ గౌడ్, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి
అభివృద్ధి చేయడం చేతకాని బీజేపీ మతం పేరుతో సమాజంలో చిచ్చు పెడుతుందని ఎమెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. ప్రజలు ఆశించిన దానికంటే అధికంగా తెలంగాణ అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో మంత్రి కేటీఆర్ చేసిన కృషితో ఇన్ఫోసిస్, ఆమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి బహుళ జాతి కంపెనీలు తరలివచ్చి, పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయన్నారు. తద్వారా లక్షలాది మందికి ఉద్యోగాలు లభించాయన్నారు.