సిటీబ్యూరో, మే 24(నమస్తే తెలంగాణ): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం గచ్చిబౌలి ఐఎస్బీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్)లో జరిగే కార్యక్రమానికి హాజరుకానున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా గురువారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయం త్రం 5 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గచ్చిబౌలి స్టేడియం నుంచి ట్రిపుల్ ఐటీ జంక్షన్, ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి విప్రొ జంక్షన్, ట్రిపుల్ ఐటీ నుంచి గచ్చిబౌలి మార్గంలో ఉన్న ఐటీ కంపెనీలు, ఇతర కార్పొరేట్ సంస్థలు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని సంస్థల పని వేళలను మార్చు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేదా ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం చేసుకునే అవకాశం ఉంటే పరిశీలించాలని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి కోరారు. ప్రధాని పర్యటన సందర్భంగా ఏయే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపు, ప్రత్యామ్నాయ మార్గాల అమలు.. వంటి వివరాలను వెల్లడించారు.
ఐఎస్బీ, గచ్చిబౌలి స్టేడియం వద్ద డ్రోన్ల నిషేధం
5 కిలోమీటర్ల వరకు డ్రోన్లు ఎగురవేయొద్దు
ఆంక్షలు విధించిన పోలీసులు
సిటీబ్యూరో, మే 24(నమస్తే తెలంగాణ): ప్రధాన మంత్రి పర్యటన నేపథ్యంలో గచ్చిబౌలి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, గచ్చిబౌలి స్టేడియం, పరిసరాల చుట్టూ 5 కిలోమీటర్ల వరకు డ్రోన్ కెమెరాలు, మైక్రో లైట్ ఎయిర్క్రాఫ్ట్, పారా ైగ్లెడర్స్ ఎగుర వేయడాన్ని నిషేధిస్తూ.. హైదరాబాద్ పోలీసు కమిషనర్/సైబరాబాద్ ఇన్చార్జి సీపీ సీవీ ఆనంద్ ఆంక్షలను విధించారు. ఈ ఆంక్షలు బుధవారం మధ్యాహ్నం 12 నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఆంక్షలను ఉల్లంఘించిన వారిపై ఐపీసీ 188, 121, 121(ఏ), 287, 336, 337, 338 సెక్షన్ల కింద చట్టపరంగా చర్యలు ఉంటాయని సీపీ స్పష్టం చేశారు.